09-10-2025 07:53:58 PM
మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో గల మీ సేవ కేంద్రం నిర్వాహకులు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష పార్టీ నాయకులు, యువ నాయకులు, సోషల్ మీడియా వారియర్లు కోరారు. గురువారం పట్టణ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో గల మీ సేవ కేంద్రాన్ని మండల తహశీల్దార్ పి సతీష్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా మీ సేవ కేంద్రం పరిధిలో ప్రజలకు అందిస్తున్న సేవలను పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన అఖిలపక్ష పార్టీ నాయకులు, యువ నాయకులు, సోషల్ మీడియా వారియర్లు మీ సేవ కేంద్రం సిబ్బంది పనితీరుపై వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా అఖిలపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ, పట్టణ ప్రాంత ప్రజలకు పౌర సౌకర్యాల సేవలు నిమిత్తం మీసేవ కేంద్రానికి వస్తున్న విద్యార్థులను, యువకులను, వృద్ధులను అవహేళన చేస్తూ, ప్రజలతో దురుసుగా వ్యవహరిస్తూ, ప్రజలకు తెలియని విషయాల గురించి సలహాలు సూచనలు ఇవ్వకపోగా, వారిని బెదిరిస్తూ, సమయపాలన పాటించ కుండా మీసేవ కేంద్రం మేనేజర్ ఉపేందర్, ఇంచార్జ్ జనార్దన్ లు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా మండల తహశీల్దార్ సతీష్ సానుకూలంగా స్పందించి, విచారణ నిర్వహించి, చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక కార్యక్రమంలో పట్టణ అఖిల పక్ష పార్టీల నాయకులు, యువ నాయకులు ఆకారం రమేష్, బండి శంకర్, దినేష్, శేఖర్, బండారి రాజేశం, కత్తి రమేష్, మాయ రమేష్, సీపెల్లి సాగర్, రాయబారపు కిరణ్, చిప్పకుర్తి శశిధర్, ఎండి జావిద్ ఖాన్, క్రాంతి, రాజు లు పాల్గొన్నారు.