02-07-2025 01:17:12 AM
ఎన్ఆర్ఐ దేవకిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి
ఖైరతాబాద్; జూలై 1 (విజయ క్రాంతి) : తమ పూర్వీకల నుంచి తమకు సంక్రమించిన భూమిని కబ్జా చేయడమేగాక బెదిరిం పులకు దిగుతూ మానసికంగా వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోని, న్యాయం చేయాలని బాధితురాలు ఎన్ఆర్ ఐ, దేవకి రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తన భర్త చిన్నారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.
మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం తిమ్మలాపూర్ లోని తన భర్త చిన్నారెడ్డికి సర్వే నెం. 426-456లలోని 40 ఎకరాల భూమి ఉన్నది. ఇందులోని 33 ఎకరాలను జడ్చర్ల ఎం.ఎల్.ఎ అనిరుధ్ రెడ్డి ప్రోద్బలంతో తిమ్మలాపూర్ కు చెందిన అతని అనుచరులు లక్ష్మీ నారాయణగౌడ్, ఎంపిటిసి శ్రీనివాస్, పోలెపల్లి యాదయ్య తదితరులు కబ్జా చేశారని ఆరోపించారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి, తప్పుడు డాకు మెంట్లతో కబ్జా చేశారని ఆరోపించారు.
అంతేగాక భూమి దగ్గరికెళ్తే తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. దీని పై స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడం లేదన్నారు. కొన్నిరోజులుగా మానసిక క్షోభకు గురవు తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
తనకు తెలియకుండానే లక్ష్మీనారాయణగౌడ్ తన బ్యాంకు అకౌంట్లోకి రూ.16లక్షలు జమ చేశారని తెలిపారు. తన భర్తకు చెందిన 33 ఎకరాలకు సంబంధించిన అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తమ దగ్గర ఉన్నాయని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి జోక్యంచేసుకొని కబ్జాదారులపై చట్ట పరమైన చర్యలకు ఆదేశించాలని, తనకు న్యాయం చేయాలని వేడుకొన్నారు.