10-06-2025 01:16:22 AM
రాష్ర్ట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): పేదవాడి సొంతింటి కలను సాకారం చేయాలన్న లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయని రాష్ర్ట రెవెన్యూ, హౌసింగ్, శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పైలట్ గ్రామాల్లో ఇండ్ల నిర్మాణాలు పూర్తిచేసుకొని గృహ ప్రవేశాలకు కూడా సిద్ధమవుతున్నట్టు పేర్కొన్నారు.
ఈ నెల 2వ తేదీ నుంచి ఈ వారానికి సంబంధించి లబ్ధిదారులకు రూ. 22.64 కోట్లు విడుదల చేసినట్లు వివరించారు. ఇందిరమ్మ ఇండ్ల పధకానికి సంబంధించి రాష్ర్టంలో ఇప్పటివరకు 9,877 ఇండ్లు బేస్మెంట్ పూర్తి కాగా, 1839 ఇండ్లు గోడల వరకు, మరో 388 ఇండ్లు శ్లాబు పనులు పూర్తయినట్లు తెలిపారు.
వీటికి మొత్తం రూ .98.64 కోట్లు విడుదల చేశామన్నారు. ఇందిరమ్మ గృహాల నిర్మాణంలో ప్రభుత్వ పర్యవేక్షణ మాత్రమే ఉంటుందని నిర్మాణ బాధ్యతలను ప్రభుత్వం చేపట్టడం లేదన్నారు. లబ్దిదారులు తమ స్ధలానికి అనుగుణంగా తమకు ఇష్టమైన రీతిలో 400 చదరపు అడుగులకు తగ్గకుండా, 600 చదరపు అడుగులకు మించకుండా నిర్మించుకునే సౌలభ్యం కల్పించామన్నారు.