02-08-2025 09:22:51 PM
జిల్లాలో నీట్ పీజీ పరీక్షకు హాజరుకానున్న అభ్యర్థులు 230
సూర్యాపేట, కోదాడలలో పరీక్ష కేంద్రాల ఏర్పాటు
జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట,(విజయక్రాంతి): జిల్లాలో నేడు నిర్వహించనున్న నీట్ పీజీ ప్రవేశ పరీక్షకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎస్. వి. ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన నీట్ పీజీ ప్రవేశ పరీక్ష కేంద్రాన్ని అదనపు కలెక్టర్ పి రాంబాబు తో కలిసి తనిఖీ చేసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. పరీక్ష కేంద్రంలో అభ్యర్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ పరీక్షకు జిల్లా నుండి మొత్తం 230 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. దీనిలో సూర్యాపేట ఎస్ వి ఇంజనీరింగ్ కళాశాల పరీక్ష కేంద్రంలో 180 మంది, కోదాడలోని సనా ఇంజనీరింగ్ కళాశాలలో 50 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు.
అభ్యర్థులను ఉదయం 7 గంటల నుండి 8:30 లోపు పరీక్ష కేంద్రంలోకి అనుమతించడం జరుగుతుందని, ఉదయం 8.30 గంటలకు తప్పనిసరిగా ప్రధాన గేటును మూసి వేయడం జరుగుతుందని వెల్లడించారు. పరీక్ష ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉంటుందన్నారు. కాగా పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈయన వెంట ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ జయలత, తహసిల్దార్ కృష్ణయ్య, తదితరులు ఉన్నారు.