31-12-2025 12:29:17 AM
కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
అర్మూర్, డిసెంబర్ 30 (విజయ క్రాంతి) : మున్సిపల్ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించేలా అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం ఆర్మూర్, భీంగల్ మున్సిపల్ కార్యాలయాలను కలెక్టర్ వేర్వేరుగా సందర్శించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై కమిషనర్లు, ఇతర అధికారులతో సమీక్షలు నిర్వహించారు. షెడ్యూల్ వెలువడిన వెంటనే ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఒక్కో వార్డు వారీగా ఓటరు జాబితాను పక్కాగా రూపొందించాలని అన్నారు.
ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా ముసాయిదా జాబితాను ప్రదర్శించాలని, అభ్యంతరాలను స్వీకరించి సకాలంలో వాటిని పరిష్కరించాలని సూచించారు. జనవరి 10వ తేదీన తుది ఓటరు జాబితా వెలువరించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన సిబ్బందిని గుర్తించి, శిక్షణ తరగతుల నిర్వహణకు ప్రణాళికలు రూపొందించుకోవాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు.
ఎన్నికల నిర్వహణలో అధికారులు, సిబ్బంది క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉన్నందున, పరస్పరం సమన్వయంతో పనిచేస్తూ ప్రశాంత వాతావరణంలో సాఫీగా ఎన్నికలు జరిగేలా కృషి చేయాలన్నారు. ఏ దశలోనూ అలసత్వానికి తావు ఇవ్వకూడదని, ఎలక్షన్ షెడ్యూల్ వెలువడిన నాటి నుండి, ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు అనుక్షణం జాగరూకతతో వ్యవహరించాలని సూచించారు.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమ, నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా విధులు నిర్వహించాలని అన్నారు. ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ శ్రావణి, భీంగల్ మున్సిపల్ కమిషనర్ గంగాధర్, భీంగల్ తహసీల్దార్ మహమ్మద్ షబ్బీర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.