మనిషి జీవితంలో మార్పు తెచ్చిన మహోన్నత వ్యక్తి డా.బీఆర్ అంబేద్కర్
జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): రాజ్యాంగాన్ని నిర్మించి మనిషి జీవితంలో మార్పు తెచ్చిన మహోన్నత వ్యక్తి డా, బీఆర్ అంబేద్కర్ అని, చదువు ద్వారానే అభివృద్ధి సాధ్యమని నిరూపించిన ఆయనకు రుణపడి ఉంటామని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. మంగళవారం డాక్టర్,, బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాలకు అయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ప్రజా సంక్షేమం, ప్రజా అభివృద్ధికి హక్కులు కల్పించే లక్ష్యంతోబడుగు బలహీన వర్గాల వారికి సమాన హక్కులు సాధించాలన్న ద్వేయంతో రాజ్యాంగాన్ని నిర్మించిన అంబేద్కర్ కు మనము ఋణపడి ఉంటామన్నారు. రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించి సరైన ప్రజా ప్రతినిధిని ఎన్నుకునే హక్కు కల్పించిన ఘనత ఆయనదన్నారు. అందరికి సమానంగా మానవహ క్కులు కల్పించారన్నారు. సామాజిక, ఆర్థిక సమానత్వం రావడానికి మనమందరం ఇం కా కృషి చేయాలని, హక్కుల కోసం అంద రూ బాధ్యత వహించాలని, విద్య ఆరోగ్యం గురించి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు.
వెనుకబడిన, బడుగు, బలహీన, వెనుకబడిన, మైనార్టీల వర్గాల కోసం తెలంగాణ ప్రభుత్వం సూర్యాపేట జిల్లాలో 3 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం చేపట్టిందని, తొండ, చిలుకూరు, గడ్డిపల్లి లో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం ఒక్కొక్క స్కూల్ కు రూ. 200 కోట్ల ఖర్చు చేస్తుందని వివరించారు. అదే విధంగా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నందు అత్యాధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. అనంతరంఅంబేద్కర్ జయంతి సందర్భంగా జిల్లా షెడ్యూలు కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాచరచన, ఉపన్యాస పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ నరసింహ, మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్ష్యాది, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, ఆర్టీవో జయప్రకాశ్ రెడ్డి, ఎస్సీ సంక్షేమ అధికారి కొల్లి లత, మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి, వైస్ చైర్మన్ షఫీఉద్దీన్, జిల్లా అధికారులు, సూర్యాపేట తాసిల్దార్ కృష్ణయ్య, డిసిసి జిల్లా ప్రెసిడెంట్ గుడిపూడి నరసయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, స్థానిక ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.






