31-07-2025 12:16:50 AM
- కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి వినతి పత్రం అందజేసిన ఎంపీ ఈటల రాజేందర్
ఎల్బీనగర్, జులై 30 : ఎల్బీనగర్ లోని జాతీయ రహదారిపై ఎలివేటెడ్ ఫ్లై ఓవర్ నిర్మించాలని బుధవారం కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ వినతి పత్రం అందజేశారు. జాతీయ రహదారి - 65పై చింతకుంట సర్కిల్ నుంచి ఆటోనగర్ చౌర స్తా వరకు ఎలివేటెడ్ ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టాలని ఎంపీ ఈటల రాజేందర్ కోరారు. విజయవాడ జాతీ య రహదారి విస్తరణలో భాగంగా ఎల్బీనగర్ నుంచి మల్కాపురం వరకు 8 వరుసలుగా నిర్మించారు.
విస్తరణలో భాగంగా అనేక చోట్ల ఫ్లై ఓవర్లు నిర్మించారు. అయితే, చింతలకుంట నుంచి ఆటో నగర్, హయత్ నగర్ వరకు ఫ్లై ఓవర్ నిర్మించాల్సి ఉన్నది. దీనిపై స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఫ్లై ఓవర్ నిర్మాణంతో వ్యాపారాలు దెబ్బ తింటాయని, అనేక కాలనీలకు అనుసంధానం తెగిపోతుందని, ఎలివేటెడ్ ఫ్లై ఓవర్ నిర్మించాలని స్థానికులు, ప్రజాప్రతినిధులు విషయాన్ని ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఎంపీ ఈటల రాజేందర్ కలిసినట్లు బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు.