14-09-2025 12:12:54 AM
ఎక్సుజ్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షలో మంత్రి జూపల్లి
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (విజయక్రాం తి): గంజాయి, డ్రగ్స్, నాటుసారా, ఎన్డీపీఎల్ నేరాలపై ఉక్కుపాదం మోపాలని ప్రొహిబిషన్, ఎక్సుజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణరావు అధికారులను ఆదేశించారు. నాం పల్లిలోని తెలంగాణ ఆబ్కారీ భవన్లో శనివారం ఆబ్కారీ, ఎన్ఫొర్స్మెంట్, ఎస్టీఎఫ్ అండ్ డీటీఎఫ్, ఎన్ఫొర్స్మెంట్ అధికారుల పనితీరుపై సమీక్షించారు.
అక్రమ, కల్తీ మద్యం, కల్తీ కల్లు, డ్రగ్స్, గంజాయి, ఇతర మాదకద్రవ్యాల విక్రయం, రవాణా, వినియోగం, నాన్డ్యూటీ పెయిడ్ లిక్కర్, చర్లపల్లి ఫ్యాక్టరీలో డ్రగ్స్ ముడి సరుకు తయారీ, ఎన్డీపీఎస్ కేసుల పురోగతి, శిక్షల రేషియో, పాత నేరస్తుల, నిందితులపై నిఘా, తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అక్రమ మద్యాన్ని, గంజాయి తదితర మాద క ద్రవ్యాల సరఫరా, వాడకంపై ఉక్కుపాదం మోపాలని ఆయా విభాగాల అధికారులకు స్పష్టం చేశారు.
సరిహద్దు రాష్ట్రాల అధికారులతో సమన్వయంగా పనిచేస్తూ కేసుల్లో సం బంధమున్న కింగ్ పిన్లను గుర్తించి, పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయాలని ఆదేశించారు. యువత భవిష్యత్ను అంధకారం చేస్తున్న గంజాయి, మాదకద్రవ్యాల లాంటి మత్తు పదార్థాల విక్రయానికి అడ్డుకట్ట వేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. డ్రగ్స్, సింథటిక్ డ్రగ్స్, గంజాయి, కల్తీ మద్యం, నాటుసా రా, కల్తీ కల్లు తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని, ప్రజల ప్రాణాలు తీసేవి రాష్ర్టంలో కనిపించటానికి వీల్లేదని స్పష్టం చేశారు.
నిఘా, విస్తృత తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఉందని, మరింత అప్రమత్త తో పని చేయాలని దిశానిర్దేశం చేశారు. సరిహద్దు రాష్ట్రాల చెక్ పోస్టుల్లో నిఘాను మరింత పటిష్టం చేయాలన్నారు. నిఘాను కేవలం చెక్కు పోస్టులకే పరిమితం చేయకుండా ఆయా గ్రామాల్లోని ఇతర మార్గాలు, సోర్సులపై కూడా నిఘా ముమ్మరం చేయాలని ఆదేశించారు.
ఎక్సుజ్ శాఖ అధికారుల కు ఆయధాలు అప్పగించే అంశంలో నిబంధనలు, ఉన్న అడ్డంకులు, ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు. చర్లపల్లిలోని ఓ ఫ్యాకర్టీలో డ్రగ్స్ ముడిసరుకు తయారీ కేసు లో పురోగతి, ఎక్సుజ్ శాఖ తనిఖీ, బయటపడ్డ అంశాలపై ఇచ్చిన నివేదిక గురించి మంత్రి ఆరా తీశారు.
12 వేల కోట్లు కాదు.. 12 కోట్లే..
మహరాష్ట్ర దర్యాప్తు సంస్థ నమోదు చేసిన ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్ట్లో ఏముందని మంత్రి అధికారులను అడిగారు. ఈ కేసులో మహారాష్ర్ట పోలీసులు స్వాధీనం చేసుకున్న నిషిద్ధ వస్తువులు, ఇతర వస్తువుల విలువ రూ.12,000 కోట్లుగా వార్తలు వచ్చాయని, దీనికి ఎలాంటి ఆధారాలు లేవని, స్వాధీనం చేసుకున్న వాస్తవ విలువ గురించి మహారాష్ర్ట పోలీసుల నుంచి ఇంకా తెలియాల్సి ఉందని, విశ్వసనీయ సమాచారం ప్రకారం వాటి విలువ సుమారు 11.95 కోట్లు మాత్రమేనని అధికారులు మంత్రికి వివరించారు.
చర్లపల్లి వంటి ఘటనల వల్ల మన విశ్వనీయతను కోల్పేయే ప్రమాదం ఉందని, భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిఘాను మరింత పటిష్టం చేయాలని, రాష్ర్టవ్యాప్తంగా ఉన్న పరిశ్రమల్లో విస్తృత సోదాలు నిర్వహించాలని ఆదేశించారు. ఇతర శాఖలతో సమ న్వయం చేసుకోవాలని సూచించారు.
గోవా లో పెన్నీ, మధ్యప్రదేశ్లో ఇప్ప సారా (మహూవా) వంటి సాంప్రదాయ మద్యాన్ని బ్రాండింగ్ చేసి విక్రయిస్తున్నారని, తెలంగాణలో ఈత, తాటి కల్లును కూడా అదే తరహా లో టొడి నేచురల్ బ్రూవరి నెలకొల్పి, బాట్లింగ్ చేసి విక్రయించే యూనిట్లను నెలకొల్పడం వల్ల గీత కార్మికులకు ఉపాధితో పాటు ఆదాయం పెరుగుతుందని, కల్తీ కల్లును కూడా నివారించవచ్చని మంత్రి అభిప్రాయపడ్డారు.
దీనిపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని చెప్పారు. నివేదిక ఆధారంగా సీఎం రేవంత్రెడ్డితో చర్చించి నిర్జయం తీసుకుంటామన్నారు. ఫంక్షన్ హాళ్లు, రిసార్టులు, ఫాంహౌసులలో జరిగే ప్రైవేట్ పార్టీల్లో నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం వినియోగంపై అబ్కారీ శాఖ దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఫంక్షన్లు, పార్టీలపైనా అబ్కారీ శాఖ ఓ కన్నేసి ఉంచాలని తెలిపారు.
ఒక బార్కు అనుమతి తీసుకొని, రెండు మూడు బార్లు నడుపుతుండటంతో పాటు ఒక అంతస్తులో బార్ నడపడానికి అనుమతి తీసుకొని రెండు, మూడు అంతస్తుల్లోనూ బార్లను నడుపుతున్న వారిపై కఠినచర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే వారికి, సహకరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
సమావేశంలో ఎక్సుజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ, కమిషనర్ సీ హరికిరణ్, ఎన్ఫొర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాజ్ ఖాసీం, అడిషనర్ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషీ, అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.