ఘనంగా అన్నమాచార్య జయంతి వేడుకలు
ముషీరాబాద్, మే 12 (విజయక్రాంతి): 617వ అన్నమయ్య జయంతి సందర్భంగా పద్మశ్రీ డా. శోభారాజు ఆధ్వర్యంలో చిక్కడపల్లి లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం నుండి ట్యాంక్ బండ్ పైగల అన్నమయ్య విగ్రహం వరకు వేంకటేశ్వర స్వామి, అన్నమయ్య వారి అర్చా మూర్తులతో పాటు చేరుకుని మహా నగర సంకీర్తన నిర్వహించారు.ఈ సందర్భంగా శోభారాజు శిష్యులు సంయుక్తంగా తొలుత ‘హరి యవతారమీతడు, బ్రహ్మమొక్కటే పర, వేడుకొందామా‘ అనే అన్నమయ్య సంకీర్తనలు భక్తి రంజకంగా ఆలపించారు.
అనంతరం స్వామి వారికి అన్నమయ్య అష్టోత్తర శతనామావళి (పుష్ప పూజ) అర్పించారు.అన్నమయ్య వేషధారణ మానస పటేల్, శ్రీ వేంకటేశ్వర స్వామి వేషధారణ సాంధీప్ వేసారు.కాగా, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా శోభా రాజు రచించి స్వర పరచిన ‘ఎక్కడున్నావ్ ఓ కల్కి దేవా! మనసారా నిను జూడ కదలి రావా!‘ అంటూ ఒక ప్రత్యేక సంకీర్తన పాడారు.
‘శ్రీ వేంకటేశ్వర స్వామియే కల్కి, ఆయన ఖడ్గమే (శ్రీ నందకమే) అన్నమయ్య అని, శోభా రాజు చేస్తున్న అన్నమయ్య యజ్ఞం రానున్న సమాజానికి ఎంతో మేలు చేకూరుస్తుందని‘ తెలిపారు. ఈ జయంతి వేడుకకు చివరిగా శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామికి, అన్నమయ్యకు హారతి అందించారు. అనంతరం భోజన ప్రసాద వితరణ చేశారు.






