calender_icon.png 9 June, 2025 | 7:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసంతృప్తులకు బుజ్జగింపులు

09-06-2025 02:16:01 AM

  1. మంత్రి పదవులను ఆశించి భంగపడిన నేతల ఆగ్రహం 
  2. సర్దిచెప్పేందుకు రంగంలోకి దిగిన కాంగ్రెస్ పెద్దలు 
  3. సుదర్శన్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి నివాసానికి వెళ్లిన మీనాక్షినటరాజన్, పీసీసీ చీఫ్ 
  4. మల్‌రెడ్డి రంగారెడ్డితో మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి పొన్నం భేటి 
  5. ప్రేమ్‌సాగర్‌రావుకు ఇవ్వకపోవడంతో సొంత పార్టీ నుంచే విమర్శలు 
  6. మూడు బెర్తులు ఖాళీగా ఉన్నాయి..వాటిలో న్యాయం చేస్తామంటున్న అధిష్ఠానం 

హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): మంత్రి పదవి ఆశించి భంగపడిన అసంతృప్తనేతలను బుజ్జగించేందుకు కాంగ్రెస్ పెద్ద లు రంగంలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో పా టు మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర నేత లు అసంతృప్త నేతల ఇళ్ల వద్దకు వెళ్లి..భవిష్యత్‌లో తగిన గుర్తింపు ఉంటుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని కోరుతున్నారు.

అయి తే మల్‌రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు తమ ఫోన్లను కొంతసేపు స్విచ్ఛాప్ చేసుకుని..పార్టీ పెద్దలకు అందుబాటులోకి రాకుండాపోయారు. పార్టీ నాయకులే వారి ఇళ్ల వద్దకు వెళ్లి మంతనాలు జరపడంతో.. అసంతృప్తులు మొత్తబ డ్డారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మంత్రివర్గ విస్తరణ ముగ్గురికే పరిమితమైందని, మిగతా ఖాళీగా ఉన్న మూడు బెర్తుల భర్తీ సమయంలో తగిన న్యాయం జరుగుతుందని చెబుతున్నారు.

కాగా, మంత్రి పదవి కోసం ఉమ్మడి రంగారెడ్డి నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, నల్లగొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన ప్రేమ్ సాగర్‌రావు, నిజామాబాద్‌లోని బోధన్ ఎమ్మెల్యే, మాజీమంత్రి సుదర్శన్‌రెడ్డి, కరీంనగర్ నుంచి మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ కూడా మంత్రి పదవిని ఆశించారు.

వీరికి మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఎన్నికల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తామన్న హామీని అమలుచేయాలని కోమ టిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మొదటి నుంచి డి మాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయి తే నల్లగొండలోనే రాజగోపాల్‌రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రిగా కొనసాగుతుండటంతో..రాజగోపాల్‌రెడ్డి విషయంలో పార్టీ అధిష్ఠానం ఆలోచనలో పడినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

ఇదే విషయం చెప్పి బుజ్జగించడానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నివాసా నికి వెళ్లారు. భవిష్యత్‌లో మంచి ప్రాధాన్యం ఉంటుందని రాజగోపాల్‌రెడ్డికి వివరించారు. ఇక బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి నివాసానికి సైతం మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు వెళ్లారు.

సుదర్శన్‌రెడ్డి పార్టీకి ఎంతో సేవలు చేశారని, తప్ప కుండా న్యాయం జరుగుతుందని హామీ ఇవ్వడంతో ఆయన మెత్తబడినట్లు పార్టీవర్గా లు చెబుతున్నాయి. ఇక నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్‌రెడ్డికి మంత్రి పదవి కచ్చితంగా వరిస్తుందని మొదటి నుంచి ఆయన నమ్మకంతో ఉన్నారు. తీరా మంత్రివర్గ విస్తరణలో పేరు లేకపోవడంతో తీవ్ర అసంతృ ప్తికి గురయ్యారు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతు న్నారు. రంగారెడ్డి నివాసానికి పీసీసీ అధ్యక్షు డు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, పార్టీ నేతలు వెళ్లి బుజ్జగింపులు చేశారు. మీనాక్షినటరాజన్ కూడా ఫోన్ చేసి మాట్లాడారు. 

వివేక్‌పై సొంత పార్టీ నేతల్లోనే తీవ్ర అసంతృప్తి.. 

ఇక ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో మొద టి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు మంత్రి పదవి వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ప్రేమ్‌సాగర్‌రావు కోసం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు కూడా మద్దతుగా ఉన్నారు. ఆ జిల్లా నుంచి వివేక్‌కు ఇవ్వడం కంటే ప్రేమ్‌సాగర్‌రావుకే ఇవ్వాలని పార్టీ అధిష్ఠానానికి భట్టివిక్రమార్క పలుమార్లు విన్నవించారు.

అయినా అక్కడ ప్రే మ్‌సాగర్‌రావు పక్కనపెట్టి వివేక్‌కు ఇవ్వడం వల్ల జిల్లాలోని పార్టీ నాయకులు తీవ్ర అసంతృత్తితో రగిలిపోతున్నారు. గత పదేళ్లు బీఆర్ ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్‌ను కష్టకాలంలో ప్రేమ్‌సాగర్‌రావు కార్యకర్తలకు అండగా నిలిచారని చెబుతున్నారు.

కాంగ్రెస్‌లో ఎంపీగా గెలిచి.. బీఆర్‌ఎస్‌లోకి వెళ్లార ని, ఆ తర్వాత కాంగ్రెస్‌కు రావడం, మళ్లీ బీఆర్‌ఎస్‌కు వెళ్లడం, బీఆర్‌ఎస్ నుంచి బీజేపీకిలోకి వెళ్లారని, తీరా ఎన్నికల ముం దు కాంగ్రెస్‌లోకి వచ్చి వివేక్, ఆయన సోదరుడు వినోద్ ఎమ్మెల్యేలుగా ఉండటమే కాకుండా, కొడుకు వంశీకి పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇప్పించుకున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు అదే కుటుంబానికి మంత్రి పదవీ ఎలా ఇస్తారని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు.   

అధిష్ఠానం మా మొర వినలేదు: మల్‌రెడ్డి రంగారెడ్డి 

మంత్రివర్గ విస్తరణ రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరిగిందని, మా మొరను అధిష్ఠానం ఆలకించలేదని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్తగా వచ్చినవారికి మంత్రి పదవి ఇచ్చి..పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి  మంత్రి పదవి ఇవ్వకపోతే ఎలా..? మంత్రివర్గంలో ఉమ్మడి 10 జిల్లాలకు  చోటుఉండా లి కదా..? ఇలాంటి నిర్ణయాలతో  పార్టీకి ఇబ్బందికర పరిస్థితి వస్తుందని మల్‌రెడ్డి రంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రి పదవులు ఇవ్వాలని 18 నెలలుగా అడుగుతున్నామన్నారు. 

వచ్చే విస్తరణలో రంగారెడ్డి జిల్లాకు న్యాయం చేస్తాం : పీసీసీ చీఫ్ 

క్యాబినెట్ విస్తరణలో కుల సమతుల్యతకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని, రెండు మంత్రి పదవులు ఎస్సీలకు, ఒకటి బీసీ వర్గానికి కేటాయించడం జరిగిందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. కుల సర్వే, ఎస్సీ వర్గీకరణ అంశాల దృష్ట్యా కేటాయింపులు అమలయ్యాయన్నారు. ఆదివారం ఆయన మల్‌రెడ్డి రంగారెడ్డి నివాసానికి వెళ్లి బుజ్జగించారు. ఈసందర్భంగా మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ..ఇంకా మూడు బెర్తులు ఖాళీగా ఉన్నాయని, వచ్చే మంత్రివర్గ విస్తరణలో రంగారెడ్డి జిల్లాకు తగిన న్యాయం చేసే విధంగా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.