06-09-2025 12:00:00 AM
నిర్మల్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్రను శాంతియుత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దీంట్లో భాగంగా జిల్లా ఎస్పీ శోభాయాత్ర వెళ్ళే మార్గాన్ని,పర్యవేక్షించారు.పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద,నిమజ్జన ఘాట్ల వద్ద 180 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని నేరుగా కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేయడం జరిగింది.
ప్రతి కదలికపై డేగ కన్ను వేసి పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. మొత్తం 508 మంది పోలీసు సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా బందోబస్తు ఏర్పాటు చేయగా, ఇందులో జిల్లా ఎస్పీ తో పాటు, ఒక అడిషనల్ ఎస్పీ, ఇద్దరు ఏ ఎస్పీ లు,11 మంది ఇన్స్పెక్టర్లు,31 మంది ఎస్ఐ లు,106 మంది ఏ ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్స్,323 మంది కానిస్టేబుల్స్, 31 మంది మహిళా పోలీసులు ఉన్నారు. రూట్మ్యాప్ ప్రకారం ప్రతి మలుపు వద్ద అదనపు సిబ్బందిని నియమించారు.
డీజే సౌండ్ వ్యవహారంలో ఆదేశాలు ఉల్లంఘించినవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నిమజ్జన శోభాయాత్రలో ప్రజల భద్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నామని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ తెలిపారు.
ప్రజలు పోలీసులు ఇచ్చిన సూచనలను పాటించి, శాంతియుత వాతావరణంలో గణేష్ నిమజ్జన ఉత్సవాలను విజయవంతం చేయాలని తెలియజేశారు. ఈ పర్యవేక్షణలో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ తో పాటు, నిర్మల్ ఏఎస్పీ రాజేష్ మీన ఐపీఎస్, పట్టణ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఆర్ ఐ (అడ్మిన్) రామ్ నిరంజన్, సిబ్బంది ఉన్నారు