23-07-2025 12:23:11 AM
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, జూలై 22 ( విజయక్రాంతి ) : ప్రాథమిక పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల్లో ఎవరైతే విద్యా సామర్థ్యాలు తక్కువ ఉన్నాయో అలాంటి విద్యార్థులను గుర్తించి వారికి ప్రతి రోజు అరగంట ఎ.ఐ విద్యా బోధన చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో హైస్కూల్, ప్రాథమిక పాఠశాల ఒకే చోట ఉండి కంప్యూటర్లు ఉన్న 23 పాఠశాల ప్రధానోపాధ్యాయులతో కలెక్టర్ ఎ.ఐ విద్య పై సమీక్ష నిర్వహించారు.
ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో ఎ.ఐ విద్యా బోధన ప్రారంభం అయినప్పటికినీ ఇంటర్నెట్, హెడ్ సెట్, కంప్యూటర్ స్థాపన తదితర సమస్యల పై సమీక్ష నిర్వహించారు. తక్షణమే కంప్యూటర్లు నెలకొల్పి ఇంట ర్నెట్, హెడ్ సెట్, ఏర్పాటు చేసుకొని 3- 5 వ తరగతిలో వెనుకబడిన విద్యార్థులకు ఎ.ఐ శిక్షణ ప్రారంభించాలని ఆదేశించారు. ఒక విద్యార్థికి అతని పెన్ ఐ.డి ద్వారా లాగిన్ అయి ప్రతిరోజు అరగంట పాటు కంప్యూటర్ అభ్యాసం చేసే విధంగా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇందుకు టైమ్ టేబుల్ సిద్ధం చేసుకోవాలని, ఉదయం 10 గంటల నుండి కంప్యూట్ తరగతులు ప్రారంభం కావాలని సూచించారు. వనపర్తి జిల్లాలో ఎ.ఐ కంప్యూటర్ విద్యా కొరకు 23 ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేసుకోగా అందులో 3వ తరగతి విద్యార్థులు 159 మంది, 4వ తరగతిలో 161, 5వ తరగతిలో 153 వెరసి 471 మంది విద్యార్థులను గుర్తించడం జరిగింది.
23 పాఠశాలల్లో ప్రస్తుతం 117 పనిచేస్తున్న కంప్యూటర్లు ఉన్నట్లు విద్యా శాఖ ఎ.యం. ఒ మహానంది తెలిపారు. అసిస్టెంట్ కమిషనర్ ఎగ్జామినేషన్ గణేష్, ఎ.యం. ఒ మహానంది, జి.సి.డి. ఒ శుభలక్ష్మి, శేఖర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తదితరులు సమీక్ష సమా వేశంలో పాల్గొన్నారు.