04-06-2025 12:56:51 AM
- శిల్ప హోమ్స్ చైర్మన్ పీ.శ్రీనివాస్రెడ్డి
హైదరాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నా, కలగన్న భవిష్యత్తు సౌధాన్ని పటిష్టం గా నిర్మించుకోవాలన్నా స్వీయ క్రమశిక్షణ ఎంతో అవసరమని శిల్ప హోమ్స్ చైర్మన్ పీ శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్ కొండాపూర్లోని ఏ జోన్ బ్యాట్మింటన్ అకాడమీలో వికారాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ నిర్వహించిన జిల్లా టోర్నమెంట్ మంగళవారం ముగిసింది. ఈ టోర్నమెంట్ బీఏవీడీ జిల్లా అధ్యక్షుడు కొసరాజు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి యూవీఎన్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ మేరకు వివిధ విభాగాల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులతోపాటు ప్రశంసా పత్రాలను అందజేశారు.
ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా పీ శ్రీనివాస్రెడ్డి, బ్యాట్ కోశాధికారి వంశీధర్, ఆర్ఆర్డీబీఏ ఆనంద్, బీఏవీడీ జాయింట్ సెక్రటరీ సుభాష్రెడ్డి, బీఏవీడీ కోశాధికారి పీవీఎల్ కుమార్, బీఏవీడీ మెంబర్ ఏవీ రమణారెడ్డి, మ్యాచ్ పాయింట్ బ్యాట్మెంటన్ అకాడమీ నిర్వాహకుడు వేణు చౌదరి, ఇంటర్నేషనల్ క్రీడాకా రిని మనీషా తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యూవీఎన్ బాబు మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పాటు చేసిన వికారాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మొదటి టోర్నమెంట్లో 265 మంది క్రీడాకారులు పాల్గొనడం సంతోషంగా ఉందని, మరిన్ని టోర్నమెంట్లు నిర్వహిస్తామని వెల్లడించారు. టోర్నమెంట్కు సహకరించిన ఏ జోన్ బ్యాట్మింటన్ అకాడమి మేనేజ్మెంట్, వారి సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.