04-06-2025 12:57:50 AM
సంగారెడ్డి, జూన్ 3(విజయక్రాంతి): నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జిన్నారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఐదు లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన మోడల్ హౌస్ ను మంగళవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సొంతింటిని నిర్మించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నప్పుడే ఇందిరమ్మ ఇళ్ల పథకం విజయవంతం అవుతుందని అన్నారు. పూర్తి పారదర్శకతతో, రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు.
మొదటి విడతలో నియోజకవర్గానికి 3500 మంజూరు కావడం జరిగిందని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఇళ్లు మంజూరు అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్, ఎంపీడీవో అరుణ రెడ్డి, సీనియర్ నాయకులు, కార్యకర్తలుపాల్గొన్నారు.