calender_icon.png 19 June, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆహార విక్రయ కేంద్రాలపై అధికారులు దాడులు

18-06-2025 10:32:34 PM

13 హోటల్స్ కు నోటీసులు జారీ...

నల్లగొండ  టౌన్ (విజయక్రాంతి): ఆహార పరిరక్షణ, ప్రమాణాల ప్రాముఖ్యతను ప్రజల్లో పెంపొందించాలనే లక్ష్యంతో యాదాద్రి జోన్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి ఆదేశాల మేరకు, నల్గొండ ఫుడ్ సేఫ్టీ అధికారి ఎన్. శివ శంకర్ రెడ్డి(Food Safety Officer N. Shiva Shankar Reddy) ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో ఎస్పీ కార్యాలయం నుండి మర్రిగూడ బైపాస్ వరకు మార్గంలో ప్రసాద్ ఉడిపి హోటల్, నందిని కిచెన్, రాజస్థాన్ టీ స్టాల్, చార్మినార్ కేఫ్, బెల్లం టీ, టీ టైమ్, అఫీజ్ పాన్ షాప్, జాగరి అడ్డా సహా పలువురు రోడ్డు పక్కన ఉన్న చిన్న చిన్న స్టాళ్లను టీ పొడి పాల నాణ్యత ప్రమాణాలను నిర్ధారణ పరీక్షలకు ప్రత్యేక తనిఖీ డ్రైవ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో హోటళ్లు, టీ స్టాల్స్, కాఫీ షాపులు ఆహార విక్రయ కేంద్రాల్లో నమూనాలు సేకరించారు. 

డ్రైవ్‌లో ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్  మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌ను ఉపయోగించి ఫిల్టర్ పేపర్ స్పాట్ టెస్ట్ నిర్వహించగా, కొన్ని నమూనాల్లో ఆహార పరిరక్షణ ప్రమాణాల లోపాలు ఉన్నట్లు గుర్తించారు.  వాటిని వెంటనే స్వాధీనం చేసుకుని వ్యాపారస్థుల సమక్షంలో ధ్వంసం చేశారు. దీనిపై సంబంధిత వ్యాపారస్థులను విచారించగా అవగాహనా లోపంతో వాడుతున్నట్లు గుర్తించి వారికీ నోటీసులు జారీ చేసి, కల్తీ పదార్థాల వాడకంపై అవగాహన కల్పించారు.

ఆహార పరిరక్షణ ప్రమాణాలను నిర్లక్ష్యం చేస్తే ప్రజల ఆరోగ్యానికి హానికలిగించే ప్రమాదం ఉన్నదని అధికారులు హెచ్చరించారు. దీర్ఘకాలిక వినియోగం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులకు దారితీయవచ్చని ప్రజలకు వివరించారు. జిల్లా ఆహార పరిరక్షణ విభాగం, కల్తీ ఆహార పదార్థాలు ప్రజారోగ్యానికి ముప్పుగా మారే అవకాశం ఉండటంతో, వ్యాపారులు నిబంధనలు పాటించాలని అవగాహనా కల్పించారు. ప్రజలు కూడా అనుమానాస్పదమైన ఆహార ఉత్పత్తులపై జిల్లా ఆహార పరిరక్షణ శాఖకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆహార పరిరక్షణను బలోపేతం చేయడం కోసం జిల్లాలో ఈ తరహా డ్రైవ్‌లు కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు. ఈ దాడుల్లో ల్యాబ్ టెక్నీషియన్ వెంకటపతి, శాంపుల్ అసిస్టెంట్ రమేష్, సిబ్బంది మహేష్ పాల్గొన్నారు.