calender_icon.png 19 June, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఆదేశాలకు లోబడి ప్రైవేటు పాఠశాలలు పనిచేయాలి

18-06-2025 10:35:37 PM

మండల విద్యాధికారి పర్వతి సత్యనారాయణ..

తూప్రాన్ (విజయక్రాంతి): మండల పరిధిలో గల ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ ఆదేశాలకు లోబడి పని చేయాలని, అందుకు వ్యతిరేకంగా వ్యవహరించిన పాఠశాలల పట్ల చర్యలు తీసుకొనుటకు ఉన్నతాధికారులకు సమాచారం అందించడం జరుగుతుందని తూప్రాన్ మండల విద్యాధికారి పర్వతి సత్యనారాయణ(Mandal Education Officer Parvathi Satyanarayana) తెలిపారు. బుధవారం మండల వనరుల కేంద్రంలో మండల పరిధిలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాల్స్ తో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ... ప్రైవేటు పాఠశాలలు తమ ఇష్టానుసారంగా వ్యవహరించకూడదని విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరిస్తే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

పాఠశాలలు ప్రభుత్వం సూచించిన సమయ సారిణి పాటించాలని, ప్రైవేట్ పాఠశాలలు తరగతుల వారిగా విద్యార్థుల నుండి తీసుకుంటున్న ఫీజు వివరాలను కార్యాలయంలో సమర్పించాల్సిందిగా కోరారు. విద్యార్థులకు డబుల్ ప్రమోషన్స్ ఇవ్వడం సరైనది కాదని ఆవిధంగా ఎవరైనా చేసిన సరిదిద్దుకోవాలని తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థులకు అధిక ధరలకు పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్నట్లు సమాచారం అందిందని, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలను విక్రయించడం చట్టరీత్యా నేరమని ఈ విషయంలో ప్రిన్సిపల్స్ తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

విద్యార్థులకు శుద్ధి చేసిన త్రాగునీరు అందేలాగా చర్యలు తీసుకోవాలని, బాల బాలికలకు ప్రత్యేకమైన బాత్రూం సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు. విద్యార్థులు డ్రాప్ బాక్స్ లో ఎవరు ఉండకుండా వారి పట్ల శ్రద్ధ తీసుకొని ప్రతి ఒక్కరూ పాఠశాలలో చదువుకునే విధంగా యాజమాన్యం, ప్రిన్సిపాల్ శ్రద్ధ వహించాలని కోరారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమని మానసిక, శారీరక వికాసం సమపాళ్లలో ఉన్నప్పుడే విద్యార్థులు ఉన్నతంగా రాణిస్తారని క్రీడల పట్ల ప్రైవేట్ పాఠశాలలు నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం సూచించిన విధంగా క్రీడా పీరియడ్స్ విద్యార్థులకు అందించాలని తెలిపారు.

పాఠశాలలో విద్యార్థులకు సమస్యలు ఎదురైనప్పుడు ముందుగా వారి తల్లిదండ్రులకు సమాచారం అందించాలని సూచించారు. వాహనాలలో విద్యార్థులను గ్రామాల నుండి తీసుకొచ్చే సమయంలో వాహనాల యొక్క భద్రత, డ్రైవర్ల అనుభవం పరిగణలోనికి తీసుకొని, ప్రత్యేక రక్షణ చర్యలు విద్యార్థులకు కల్పించాలని మండల విద్యాధికారి పర్వతి సత్యనారాయణ సూచించారు. సమావేశంలో మండల పరిధిలో గల ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాల్స్, మండల వనరుల కేంద్రం సిబ్బంది, సి.ఆర్.పి. లు పాల్గొన్నారు.