calender_icon.png 19 June, 2025 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంట రుణాలు సకాలంలో మంజూరు చేయాలి

18-06-2025 10:28:48 PM

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలో వ్యవసాయ, మత్స్య, గ్రామీణ, పట్టణ ఉపాధి రంగాల అభివృద్ధికి బ్యాంకులు పూర్తిస్థాయిలో సహకరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎల్‌డీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి డిసిసీ, డీఎల్ఆర్‌సి సమావేశంలో శాసన సభ్యులు, బ్యాంకుల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... రైతులకు పంట రుణాలను లక్ష్యంగా తీసుకొని సకాలంలో మంజూరు చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. పంట భీమా అమలుపై సానుకూల దృష్టితో ముందుకు సాగాలని చెప్పారు. 

పీఎం విశ్వకర్మ, పీఎం ఈజీపి, డెయిరీ యూనిట్లు, మత్స్యకారుల రుణాలు, ఎస్‌హెచ్‌జీ మహిళల వ్యక్తిగత, సంఘాల రుణాలు, ముద్ర, రాజీవ్ యువ కిరణల వంటి పథకాల అమలులో బ్యాంకులు సానుకూలంగా వ్యవహరించాలన్నారు. పట్టణాల్లో మెప్మా ద్వారా, గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలుగా కిరాణ దుకాణాలు, బ్యూటీ పార్లర్, పెయింటింగ్ వంటి రంగాల కోసం అవసరమైన రుణాలను సులభంగా మంజూరు చేయాలని తెలిపారు. మహిళా శక్తి క్యాంటిన్ వంటి పథకాల్లో బ్యాంకులు భాగస్వామ్యం కావాలన్నారు. పంట రుణాల వడ్డీలు చెల్లించి రైతులు రినివల్ చేసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్, శాసన సభ్యులు కలిసి వార్షిక ఋణ ప్రణాళిక 2025–26ను విడుదల చేశారు.

జిల్లాలో వ్యవసాయ రంగానికి రూ.4,70,674.3 కోట్లు, విద్య, గృహ, ఆరోగ్య రంగాలకు రూ.1,13,257.99 కోట్లు రుణంగా పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించామని కలెక్టర్ తెలిపారు. పశుపోషణ, కోల్డ్ స్టోరేజీ, పంటల నిల్వ వంటి వ్యవసాయ ఆధారిత రంగాలకు, మహిళా సంఘాలకు ప్రత్యేక రుణ ప్రోత్సాహకాలు, ఎంఎస్‌ఎంఈలకు నిధుల సమకూర్పుతో పాటు స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వనున్నట్లు వివరించారు. డిజిటల్ లావాదేవీల పెంపు కోసం ఆటోమెషన్ వంటి చర్యలకు బ్యాంకులు సహకరించాలన్నారు. ఎస్ఎల్బీసీ, డిఎల్సీసీ, బిఎల్బీసీ స్థాయిల్లో సమీక్షలు జరిపి బ్యాంకులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. అనంతరం బ్యాంకుల వారీగా లక్ష్యం, పురోగతి తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో నిర్మల్, ముధోల్, ఖానాపూర్ శాసన సభ్యులు మహేశ్వర్ రెడ్డి, రామారావ్ పటేల్, వెడ్మ బొజ్జు పటేల్, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఎల్‌డీఎం రాంగోపాల్, బ్యాంకుల ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.