ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు
చౌటుప్పల్, మార్చి5 : చౌటుప్పల్ రైతు వేదికలో గురువారం రైతులకు ప్రకృతి వ్యవసాయం(నేషనల్ మిషన్ ఆన్ నాచురల్ ఫామింగ్)మీద అవగాహన సదస్సు మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు అధ్యక్షతన నిర్వహించారు.
దీనికి ముఖ్యఅతిథిగా ప్రధాన వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంసుందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ రైతులందరూ దేశీయ విత్తనాలను సేకరించి వాటిని ఉపయోగించాలన్నారు. అలాగే సేంద్రియ పద్ధతిలో ఒక రైతు 10 గుంటలైన తన ఇంటికి సరిపడా వరి ధాన్యాన్ని పండించాలన్నారు. అలాగే పెట్టుబడికి సంబంధించి ఇతర రసాయనాల మీద ఆధారపడకుండా జీవామృతం, ఘన జీవామృతం రైతులే తయారు చేసుకుని వాడాలన్నారు.
అలాగే రైతులు యూరియా వాడకం తగ్గించి దాని బదులు వేపపిండి వాడడం వలన వరి పైరు కంకులు మొత్తం ఒకేసారి రావడం చీడపీడల ఉధృతి తగ్గుతుందని తెలిపారు. తదుపరి మున్సిపల్ చైర్మన్ మోగుదాల పావని రమేష్ మాట్లాడుతూ రైతులందరూ పూర్వ పద్ధతులు అనుసరించి వ్యవసాయం చేయాలన్నారు. అనంతరం పెద్ద కొండూరు గ్రామానికి సంబంధించిన వాకిటి రజిత రైతు గత పది సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఆమె రైతులతో తన అనుభవాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోశిక వినయ్ ,కౌన్సిలర్స్ ఉదరి యాదయ్య ,ఆలె శ్రీలత చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.




