21-08-2025 03:01:13 PM
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండల రైతులకు నానో యూరియా, డీఏపి వాడకంపై మండల వ్యవసాయ అధికారి అంజనీ దేవి అవగాహన కల్పించారు. నానో (ద్రవ రూప)యూరియా వినియోగంతో రైతులకు ఖర్చులు తగ్గుతాయని 45 కిలోల యూరియా బస్తా, 500 ఎంఎల్ నానో యూరియాకి సమానం అని తెలిపారు. ద్రవ రూపంలో ఉండే నానో యూరియాలో కూడా ప్రస్తుతం రైతులు వాడుతున్న యూరియాకు సమానంగా నత్రజని ఉంటుందని, నానో యూరియా వాడడం వలన 80 శాతం నత్రజని మొక్కలకు అందుతుందని సాధారణ యూరియా 50 శాతం మాత్రమే అందుతుందని తెలిపారు. నానో యూరియా నేరుగా మొక్కలకు గాని పంట పొలాలకు స్ప్రే చేయడం వలన ఎక్కువ మోతాదులో నత్రజని అంది మొక్క ధృడంగా తయారవుతుందని, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు శృతి, మహేష్, రైతులు కొలను వెంకట్ రెడ్డి, మల్గ వెంకన్న, మల్గ రాములు పాల్గొన్నారు.