27-10-2025 05:32:29 PM
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
ప్రభుత్వ వైద్య సేవలపై వివరించాలి
విధులకు గైర్హాజరైన ఇద్దరికి షోకాజ్ నోటీసులు జారీ
ఇంచార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్
నేరెళ్ల పీహెచ్ సీ ఆకస్మిక తనిఖీ
రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): తంగళ్ళపల్లి మండలంలో సీజనల్ వ్యాధులపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే వారికి అవగాహన కల్పించాలని ఇంచార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. తంగళ్లపల్లి మండలంలోని నేరెళ్ల పీహెచ్ సీని ఇంచార్జి కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వైద్యులు, సిబ్బంది హాజరు రిజిస్టర్, రక్త పరీక్షలు చేసే ల్యాబ్, మందుల గది, ఇతర గదులు, ఆవరణ పరిశీలించారు. వ్యాక్సిన్లు, మందుల నిలువుపై ఆరా తీశారు. ఎలాంటి సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైన ఫార్మసిస్ట్, సూపర్వైజర్ కు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు.
రోజు ఆసుపత్రికి ఎందరు రోగులు వస్తున్నారని, ఎందరు గర్భిణులు వైద్య సేవలు పొందుతున్నారని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ మాట్లాడారు. వైద్యులు, సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వ వైద్య సేవలపై అందరికీ అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులు, పరిసరాల పరిశుభ్రతపై వివరించాలని తెలిపారు. గర్భిణులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఇక్కడ నేరెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.