03-07-2025 12:16:18 AM
హర్షాలీ మల్హోత్రా. ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు కానీ, ‘బజరంగీ భాయిజాన్’ బదిర బాలిక అంటే ఠక్కున గుర్తు పట్టేస్తారు! ఔను, 2015లో సల్మాన్ఖాన్ హీరోగా వచ్చిన ఆ సినిమానే బాలనటిగా గుర్తింపు తెచ్చిపెట్టిందీ ముంబయి ముద్దుగుమ్మకు. హిందీలో పలు సీరియల్స్లో నటించిన ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతోంది. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నంద మూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’.
‘అఖండ’కు సీక్వెల్గా రూపొందుతున్న ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సమర్పకురాలిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాతో హర్షాలీ మల్హోత్రా టాలీవుడ్కు ఎంట్రీ ఇస్తున్న విషయాన్ని మేకర్స్ బుధవారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు చిత్రంలో హర్షాలీ పాత్రను ‘జనని’గా పరిచ యం చేస్తూ ఆమె ఫస్ట్లుక్ను విడుదల చేశారు.
ఈ పోస్టర్లో హర్షాలీ సంప్రదాయ చీరకట్టులో చిరునవ్వులు చిందిస్తూ అం దంగా కనిపించింది. ఈ సినిమాలో సంయుక్త కథానాయికగా నటిస్తుండగా, ఆది పినిశెట్టి ఓ శక్తిమంతమైన పాత్రను పోషిస్తున్నారు. ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంగీతం: థమన్; డీవో పీ: సీ రాంప్రసాద్, సంతోష్ డీ డెటాకే; ఫైట్స్: రామ్- ఆర్ట్: ఏఎస్ ప్రకాశ్; ఎడిటర్: తమ్మిరాజు.