19-06-2025 12:27:59 AM
రూ.6517.51 కోట్ల జిల్లా వార్షిక ప్రణాళిక ఆవిష్కరణ
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, జూన్ 18(విజయక్రాంతి):ప్రాధాన్యతా రంగానికి బ్యాంకులు వచ్చే సంవత్సరం పూర్తి లక్ష్యాలు సాధించడానికి చిత్తశుద్ధితో పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. వచ్చే వార్షిక సంవత్సరానికి రూ.6517.51 కోట్లతో జిల్లా వార్షిక రుణ ప్రణాళికను నిర్ణయిస్తూ జిల్లా వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్ ఆవిష్కరించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులు, బ్యాంకు మేనేజర్స్, వివిధ బ్యాంక్ కంట్రోలర్ తో బ్యాంకుల రుణ వితరణ, బ్యాంకు లింకేజీకి ఉన్న ప్రభుత్వ పథకాలపై డీసీసీ - డిఎల్ఆర్సి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాజీవ్ యువ వికాస పథకం జిల్లాలో స్వయం ఉపాధి, రంగాలలో లక్ష్యాలు నిర్దేశించుకుని రుణాలు అందించాలని తెలిపారు. వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ రైతాంగానికి లోన్స్ మంజూరు చేయాలన్నారు. కోటి మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు అధిక మొత్తంలో రుణాలు అందించి తోడ్పాటున అందించాలన్నారు.
జిల్లా వార్షిక రుణ ప్రణాళిక 2024-25 ప్రకారం వివిధ రంగాలలో రూ.5857 కోట్లు రుణాల లక్ష్యం ఉండగా, రూ.4366.84 కోట్లు (74.55 శాతం) రుణాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇందులో వ్యవసాయేతర రుణాల లక్ష్యం రూ.3647.75 కోట్లు ఉండగా, మెదక్ జిల్లాలో రూ.2857.75 కోట్లు (78.34 శాతం) మంజూరు చేయటం జరిగిందని వివరించారు. పంట రుణాల లక్ష్యం రూ. 2267.25 కోట్లు ఉండగా, జిల్లాలో రూ1603.80 కోట్లు (70.74 శాతం) మంజూరు చేయటం జరిగిందని చెప్పారు.
ప్రణాళిక ప్రకారం రుణాలు మంజూరు చేయడంలో చొరవ చూపుతున్న బ్యాంకర్స్ ని కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు. అనంతరం వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్డీవో శ్రీనివాస్, ఎల్డియం నరసింహ మూర్తి, డీడీఎం నాబార్డ్ కృష్ణ తేజ, ఎల్డిఓ ఆర్బీఐ శ్రావ్య , వివిధ వాణిజ్య, సహకార బ్యాంకుల కంట్రోలర్స్, బ్రాంచ్ మేనేజర్లు, ఇతర సీనియర్ డిస్ట్రిక్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లుపాల్గొన్నారు.