calender_icon.png 24 June, 2025 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండండి

24-06-2025 12:38:02 AM

నిర్మల్ జూన్ 23 (విజయ క్రాంతి): వర్షాకాలం నేపథ్యంలో డయేరియా కేసులు పెరిగే అవకాశం ఉన్నందున, ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అతిసార వ్యాధి నిరోధక అవగాహనా కార్యక్రమంపై ఆయన అధికారులతో చర్చించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, వర్షాకాలం నేపథ్యంలో జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆహార, నీరు, పారిశుధ్య విషయాల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, పట్టాన, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు.

ఈనెల 16వ తేదీ నుంచి జూలై 31 వరకు ఇంటెన్సిఫైడ్ డయేరియల్ కంట్రోల్ ఫోర్ట్నైట్ (ఐడీసీఎఫ్) కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని సూచించించారు. 5 ఏళ్ల లోపు చిన్నారుల్లో నీళ్ల విరేచనాల నివారణ లక్ష్యంగా 45 రోజులపాటు అవగాహనా కార్యక్రమాలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. జిల్లాలో 1,88,929 కుటుంబాలలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సర్వేలో నిర్వహించి 73,715 మంది చిన్నారులను గుర్తించడం జరిగిందని తెలిపారు.

ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ ఇంటింటికీ ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయాలని సూచించారు. అంగన్వాడీలు, పాఠశాలలు, వసతి గృహాలలో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వర్షాకాలంలో డయేరియా ప్రభావం అధికంగా ఉండే కారణంగా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, జింక్ మాత్రలను పంపిణి చేయాలనీ ఆదేశించారు.

ఇటుక బట్టీలు, గిరిజన తండాలు, సంచార జాతుల నివాస ప్రాంతాల్లో మొబైల్ వాహనాల ద్వారా వైద్యసేవలు అందించాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, డీఎంహెచ్‌ఓ డా.రాజేందర్, ఆర్డీఓ రత్నకల్యాణి, ఐసీడీఎస్, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.