08-11-2025 05:00:41 PM
ప్రసూతి, నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణలో అగ్రగామిగా ఉన్న ఫెర్నాండెజ్ హాస్పిటల్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బెటర్ బర్తింగ్ ఎక్స్పీరియన్స్ కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ కాన్ఫరెన్స్ లో భారత్ తో పాటు విదేశాల నుండి డాక్టర్లు, ఫిజియోథెరపిస్టులు, హెల్త్ స్పెషలిస్టులు పాల్గొంటున్నారు. ప్రసవాలను సురక్షితంగా, మరింత సహజంగా చేయడానికి వినూత్న మార్గాలను, కీలకమైన సలహాలు, సూచనలు చేయనున్నారు.
ఈ సారి రీఇమాజినింగ్ చైల్డ్ బర్త్: ఏ కాల్ ఫర్ చేంజ్ థీమ్ తో కాన్ఫరెన్స్ ను నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఇంటరాక్టివ్ వర్క్షాప్లు, పేపర్ ప్రెజెంటేషన్లు, ప్యానెల్ చర్చలు జరుగుతాయి. తల్లి-నవజాత శిశువుల ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడం, మిడ్వైఫరీ నేతృత్వంలోని సంరక్షణను ప్రోత్సహించడం, సహకార నమూనాలను బలోపేతం చేయడం, ప్రతి మహిళకు సమాచారంతో కూడిన నిర్ణయం తీసుకోవడానికి మద్దతు ఇవ్వడం వంటివి ప్రధాన అంశాలుగా ఉన్నాయి. భారతదేశ పురోగతి దేశంలోని మహిళల ఆరోగ్యం, సాధికారతపైనే ఆధారపడి ఉందని ఫెర్నాండెజ్ హాస్పిటల్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ ఎవిటా ఫెర్నాండెజ్ చెప్పారు.