14-06-2025 12:00:00 AM
ఇప్పటికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం మీద సమగ్రమైన అవగాహన ప్రభుత్వ ప్రతిపక్షాలకు లేకపోవడం విచారకరం. సరైన నిబద్ధత ఉంటే ఈ రెండింటినీ ఉచితంగా అందించే వీలుంటుంది. అందుకు ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తే ప్రజలు సంతోషిస్తారు.
ప్రజాస్వామిక రాజ్యాంగ వ్యవస్థలో ప్రభుత్వ పరిపాలన వ్యవ హారం ఎత్తు పల్లాలతోనూ, విమర్శలు, ఎదుర్కొనడమూ పరిపాటి. అయినప్పటికీ ప్రభుత్వం ప్రజాస్వామిక వ్యవస్థ అన్న ఆలోచనలో ప్రజారంజకమైన పరిపాలన రూపొందించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ క్రమంలో పలు రకాల రాజకీయ విమర్శలు ఎదురుకాక తప్పదు. అయితే, వీటిని సద్వినియోగం చేసుకొని ప్రజాభిప్రాయాల మేరకు పాలనను కొనసాగించాలి.
కేవలం మాటలకే పరిమితం కాకుండా ఇచ్చిన హామీలను నెరవేర్చేలా ప్రభుత్వాలు ముందుకు వెళ్లాలి. అప్పుడే ప్రజలకు సరైన న్యాయం జరుగుతుంది. నాయకులు కూడా సముచితమైన గౌరవాన్ని పొందుతారు.
దీనిని దృష్టిలో వుంచుకొని పాలకులు ప్రతిపక్షాలను గౌరవిస్తూ, విమర్శలు ప్రతివిమర్శలు స్వీకరిస్తూ ప్రజలకు మేలు చేసేలా పాలనా విధానాన్ని కొనసాగించాలి. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని కాపాడాల్సి ఉంటుంది. రైతును రాజును చేసేలా ప్రభుత్వ విధానాలు రూపొందాలి.
ప్రజలను పాలించే ప్రభుత్వం ఏ రూ పంలో ఉన్నా భిన్నాభిప్రాయాలు, విమర్శలను ప్రజలతోపాటు ప్రజాసంఘాలు రా జకీయ పార్టీలనుంచి ఎదుర్కోక తప్పదు. సమాజంలో అన్ని వృత్తుల లాగానే పాలకులుగా ప్రజలమధ్యకు వచ్చే వివిధ సం బంధిత ప్రజాప్రతినిధులు మెలగాలి. అది కూడా ప్రజల మధ్య, ప్రజల కోసం పని చేయవలసిన ఒక వృత్తి కళాకారులుగానే వారిని భావించాలి.
ఒక నాటకంలో పాత్రధారులు తన పాత్రకు సహజసిద్ధ రీతిలో న్యాయం చేస్తున్నారా లేదా అని గమనించే వాళ్లు ప్రేక్షకులు. అలాగే, పాలకులు ప్రజ ల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాసంపదను అందరికీ సమానంగా పంపిణీ చేసే క్రమంలో నిష్పక్షపాతంగా నిబద్ధతతో వ్య వహరిస్తున్నారా లేదా అని నిర్ణయించేది ప్రజలే. అందుకే, ‘ప్రజలంటే ప్రభువులు.
ప్రజల కేంద్రంగా సాగేదే పాలన’ అని ప్రజలతోపాటు పాలకులూ అంగీకరించాలి. లేకుంటే సముద్రంలో ప్రవాహానికి ఎదురు ఈదినట్లే అనుకోని ఆపదలను కోరుకునే తెచ్చుకోవడం అవుతుంది.
సమన్వయం, సమతుల్యత తప్పనిసరి ఆర్థికంగా సహజవనరుల పరంగా ఆ యా ప్రాంతాల మధ్య అభివృద్ధిలో తేడా ఉండే అవకాశం ఉంటుంది. మొత్తం మీద నాయకత్వం సమర్థవంతమైతే ప్రజల భాగస్వామ్యాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతిపక్షాల సద్విమర్శలను స్వీకరించాలి. ఈ కోణంలో చట్టసభలను సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా ప్రజలు మెచ్చేలాంటి పాలనను అందించవచ్చు.
కానీ, ప్రధానంగా అధికార పార్టీకి సంబంధించిన వ్యవహారంలో అడుగడుగునా ప్ర భుత్వాన్ని ఇరుకున పెట్టాలనే ప్రయత్నాలు ఎవరికైనా మంచివి కావు. ఆయా పార్టీల నాయకులే ఇలా చేయడాన్ని మనం గమనించవచ్చు. బలమైన ఒక వర్గం తమ వారికే బాధ్యతలు, మంత్రి పదవులు రా వాలని ఆశించే క్రమంలో రాజీనామాల కూ తెగించే ఆలోచనలు చేస్తారు.
ఈ రకంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రమాదాలు ఉన్నాయి. ఇది కూడా ప్రభు త్వ వైఫల్యానికి ప్రధాన కారణం. ఇక ప్రతిపక్షాలు కేవలం ఇచ్చిన హామీలపైనే విమ ర్శలు గుప్పించడం తప్ప సద్విమర్శ, సమాలోచన, విశ్లేషణ, రాష్ర్ట దేశ ప్రయోజనాల పైన లోతైన అవగాహనతో మెలగాలి. అం తేకాని అకారణంగా అధికార పార్టీని బద నాం చేసే ఎత్తుగడలు సమంజసం కావు.
ఇటీవలి కాలంలో అధికారంలో ఉన్న ప్ర భుత్వాన్ని ప్రతిపక్షాలు ఇష్టారాజ్యంగా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడిన సందర్బాలు చూశాం. ప్రజలను ప్రభుత్వం మీదకి రెచ్చగొట్టే విధానాలను మానుకొని ప్రజల ఆకాంక్షలపైన శాశ్వత ప్రాతిపదికన పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీయడంలో తప్పులేదు. ఇప్పటికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం మీద సమగ్రమైన అవగాహన ప్రభుత్వ ప్రతిపక్షాలకు లేకపోవడం విచారకరం.
సరైన నిబద్ధత ఉంటే ఈ రెండింటినీ ఉచితంగా అందించే వీలుంటుంది. అందు కు ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తే ప్రజలు సంతోషిస్తారు. కానీ, ఊకదంపుడు హామీలు అమలు చేయమని కోరడం వంటివి కేవలం ఘర్షణ కోసమే తప్ప ప్రజల కోసం కాదని అర్థమవుతుంది.
ప్రజల ఆకాంక్షలే పరమావధిగా..
ప్రజల న్యాయమైన ఆకాంక్షలు, ఆలోచనలను పెడచెవిన పెట్టడమూ ప్రభుత్వాల కు మంచిది కాదు. ప్రజల డిమాండ్లను పరిష్కరించకపోగా అనేక సందర్భాల్లో నిర్బంధాలతో హింసించిన సందర్భాలు సైతం ఉంటున్నాయి. ఈ నిర్బంధం ప్రజల పక్షాన పని చేస్తున్న బుద్ధిజీవులు, మేధావులు, ప్రజాసంఘాలు, ఉద్యమకారులపై కొనసాగుతూనే వుంది.
ప్రజలు, ప్రజాస్వామ్యవాదుల అభిప్రాయాలను తృణీకరిం చడం వంటివీ ప్రభుత్వాలు విఫలం కావడానికి ప్రధాన కారణమవుతాయి. అంతే కాదు, ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పెట్టుబడిదారీ విధానానికి వంత పాడు తూ, ప్రైవేటీకరణను పెంచి పోషించే ప్రభుత్వాలకు సామాన్యూలకు ఎప్పుడూ శత్రువులుగానే కనిపిస్తారు. ఇది నిరంతర ఘర్షణకు, ఉద్యమాలకు, హింసకు దారితీస్తున్న విషయాన్ని పాలకులు ఇప్పటికైనా ఆలోచించాలి.
ప్రభుత్వాల బాధ్యతా రాహిత్యమూ చెప్పనలవి కాదు. ఉదా॥కు విద్యారంగంలో 59 ఏళ్ల క్రితం ఈ దేశంలో కామన్ స్కూల్ ప్రవేశపెట్టాలని కొఠారీ కమిషన్ సూచిస్తే ఇప్పటికీ దిక్కులేదు. ప్రభుత్వ రంగంలో విద్య, వైద్యం అందని ద్రాక్షగా మారిపోతే పేదలు ప్రైవేట్ రంగంపై ఆధారపడక తప్పడం లేదు. దీంతో పేదలు తమ కొనుగోలు శక్తిని కోల్పోతున్నారు. ఫలితంగా పేదరికం మరింత పెరుగుతున్నది. ఇది నిజంగా ప్రభుత్వాలు తమ సామాజిక బాధ్యతను విస్మరించినట్టే అవుతుంది. ప్రభుత్వాలు పనిచేసేవి సంపన్న వర్గాలకోసమేనా అన్న అనుమానాలు వస్తాయి.
మానవీయత, సామాజిక న్యాయం..
ప్రధానంగా ఒక ప్రభుత్వం సఫలం కావాలంటే, పాలన జనరంజకంగా ఉండాలంటే రాజకీయ యంత్రాంగంతోపాటు ఉద్యోగ వర్గంలోనూ అవినీతి ఉండకూడ దు. దానిని అన్ని స్థాయిల్లో కూకటివేళ్ళతో పెకిలించాలి. న్యాయ వ్యవస్థ, అవినీతి నిర్మూలన సంస్థలు మరింత స్వయంప్రతిపత్తితో దీనికోసం పనిచేయాలి. అవినీతికి దూరంగా ఉంటూ, ప్రజల సంపదకు తా ము కాపలాదారులమని, ప్రజలే తమకు ప్రభువులనే భావన ఉద్యోగుల్లో రావాలి.
అవినీతిపరులపైన ఉక్కుపాదం మోపడానికీ ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి. పెట్టుబడి దారీ వర్గ స్వభావం ప్రభుత్వానికి ఉంటే సంపన్నులు, కార్పొరెట్లకే వంత పాడే అవకాశం ఉంటుంది. గత పదేళ్లలో భారతదేశ వ్యాప్తంగా ప్రభుత్వరంగం నుంచి బ్యాంకులు 16 లక్షల కోట్ల రూపాయలను మాఫీ చేసినా అది కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో జరిగిందే అన్నది గమనార్హం.
పీడన, దోపిడీ, అణచివేత, అకృత్యాలు, అత్యాచారాలు, హింస, వివక్ష, పేదరికం వంటివి విచ్చలవిడిగా ఉండే పరిస్థితులు పోవాలి. అవేమీ తమకు పట్టనట్లు ప్రభుత్వాలు పేదరికం తగ్గిందని, 4వ ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలో స్థానం సంపాదించుకున్నామని, భారతదేశం అద్భుతంగా వెలిగి పోతున్నదని, బంగారు తెలంగాణ సాకారం అవుతుందని పాలకులు పదేపదే వల్లిస్తూ ప్రజలను భ్రమల్లో ముంచడం భావ్యం కాదు.
మానవీయ సమాజాన్ని నిర్మించాలనుకున్నప్పుడు పాలకులలో మానవీయత, తోటి మనిషిని సాటి మనిషిగా చూసే స్వభావం పాలనా వ్యవస్థల లో కనపడాలి. సామాజిక న్యాయాన్ని సా ధించే క్రమంలోనూ పాలకులు అనేక సా మాజిక వర్గాల ఒత్తిడికి గురవడం సహ జం. మంత్రివర్గంలో, రాజకీయ పార్టీలో, కార్యవర్గంలో ఎక్కడ చూసినా ఆధిపత్య వర్గాల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం భావ్యం కాదు.
అది పరోక్షంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ఆగ్రహానికి కారణమవుతుంది. పదవుల కోసం కాదు ప్రజల కోసమే రాజకీయాలకు వచ్చామన్న సందేశాన్ని పార్టీ నాయకులు ఇవ్వాలి. ఎంతటి వారైనా పార్టీ క్రమశిక్షణను అంగీకరించాలి. ఇలా ప్రభుత్వం సమతూకంగా వ్యవహరిస్తే అన్ని వర్గాల ప్రజల మద్దతు పొందే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.