ఏడాది చివరి నాటికి భద్రకాళి టెంపుల్ పనులు పూర్తి
మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, మార్చి 24 (విజయక్రాంతి): వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయ పనులన్నీ వచ్చే తొమ్మిది నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం శాసనమండలిలో పోచంపల్లి శ్రీనివాస రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఆలయం పనుల విషయంలో మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస రెడ్డి అనేకసార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారన్నారు.
ఆలయ మాడ వీధులు, ప్రహరీ నిర్మాణం, గార్డెనింగ్ పనులను ఏడాది చివరి నాటికి పూర్తి చేస్తామన్నారు. గత ప్రభుత్వం భద్రకాళి ఆలయం మాస్టర్ ప్లాన్ పేరుతో రూ.30 కోట్లు కేటాయిస్తున్నట్లు జీవోలు ఇచ్చిందని, కానీ నిధులు విడుదల చేయలేదన్నారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన నిధులను కేటాయించి పనులు పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.




