calender_icon.png 22 June, 2025 | 2:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతి దరఖాస్తులను పరిశీలించాలి

21-06-2025 10:55:03 PM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్...

కామారెడ్డి (విజయక్రాంతి): రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన భూభారతి దరఖాస్తులను సోమవారం నుండి పరిశీలించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్(District Collector Ashish Sangwan) రెవిన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం రెవెన్యూ అధికారులు, సర్వేయర్లతో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ విక్టర్ లతో కలిసి  భూభారతి  దరఖాస్తుల పరిశీలన చేశారు, ప్రజావాణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం, భూ సర్వే పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం, నిర్మాణం పూర్తయి మిగిలి ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక, పెండింగ్ రేషన్ కార్డ్ లబ్ధిదారుల ఎంపికపై జిల్లా కలెక్టర్ చర్చించి తగు ఆదేశాలు జారీ చేశారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూభారతి చట్టం ద్వారా భూ సమస్యల పరిష్కారానికి జిల్లా వ్యాప్తంగా నిన్నటి వరకు రెవెన్యూ సదస్సుల ద్వారా 31 వేలకు పైగా దరఖాస్తులను స్వీకరించడం జరిగిందని అన్నారు. ఆయా దరఖాస్తులను సోమవారం నుండి పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు.ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా స్వీకరించి పెండింగ్ లో ఉన్న ఆర్జీలను ఆలస్యం చేయకుండా తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. భూమి సర్వే కు సంబంధించి పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను కూడా త్వరగా పరిష్కరించాలన్నారు.

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయి ఏదేని కారణాల వలన లబ్ధిదారులకు అందించకుండా పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలన్నారు. రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి అర్హత ఉన్న వారి జాబితా సిద్ధం చేసి వారికి రేషన్ కార్డు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లాలోని అన్ని మండలాల తహసిల్దార్లు, డిప్యూటీ తాసిల్దార్లు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.