21-06-2025 10:50:02 PM
ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు..
లక్షేట్టిపేట (విజయక్రాంతి): విద్య, వైద్యం ప్రజలకు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు(MLA Prem Sagar Rao) అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కళాశాలలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. కార్పొరేట్ స్కూల్స్, కాలేజస్ లలో లేనటువంటి మౌళిక సదుపాయాలతో కూడిన భవనాలు నిర్మిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా నిలిచేలా లక్షేట్టిపేటలో భవనాన్ని నిర్మించడమే కాకుండా నాణ్యమైన విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు.
సుమారు 1000 కి పైగా విద్యార్థులు ఈ ఏడాది అడ్మిషన్స్ అయ్యేలా ప్రయత్నం చేయాలని ఉపాధ్యాయ, అధ్యాపకులకు సూచించారు. కేవలం బిల్డింగ్ నిర్మాణమే కాకుండా నిష్ణాతులు అయినా టీచర్స్, లెక్చరర్స్ ఆధ్వర్యంలో విద్యా బోధన ఉంటుందని హామీ ఇచ్చారు. అంతేకాకుండా త్వరలోనే హాస్టల్ సౌకర్యం కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. రాబోయే రోజుల్లో నీట్, ఐఐటీ, జెఈఈ లాంటి పోటీ పరీక్షలకు విద్యార్థులు ప్రిపేర్ అయ్యేలా కోచింగ్ కూడా ఏర్పాటు చేస్తామని వివరించారు.
అంతకుముందు ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించి పనులు వేగవంతం చేయాలని సూచనలు చేశారు. వచ్చే నెల 3న ఆసుపత్రి భవనం ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, నాయకులు నాగభూషణం, ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, గడ్డం త్రిమూర్తి, పూర్ణ చందర్ రావు,చింత అశోక్, పింగళి రమేష్, ఆరీఫ్, వెంకటస్వామి గౌడ్, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.