25-04-2025 02:15:18 AM
మునుగోడు, ఏప్రిల్ 24 (విజయ క్రాం తి): భూముల విషయంలో అన్యానికి గురైన వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే భూభారతి చట్టం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకు వచ్చిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా,మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండల కేంద్రంలో రెవిన్యూ శాఖ నిర్వహించిన తెలంగాణ భూభారతి చట్టం ( భూమి హక్కుల రికార్డు) 2025 మండల స్థాయి అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన మాట్లాడారు.
వేల ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను కొట్టేయడానికి ఒక పథకం ప్రకారం విదేశీ సంస్థలతో చేతులు కలిపి తీసుకొచ్చింది ధరణి పోర్టల్ అని పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం,బిఆర్ఎస్ ప్రభుత్వం శివన్నగూడెం రిజర్వాయర్ చేపట్టింది కానీ నీటిని ఎక్కడినుండి తీసుకురావాలనే దానిపై దృష్టి సారించలేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎదుల్ల రిజర్వాయర్ నుండి నేరుగా నీటిని తీసుకురావడానికి టెండర్లు పిలుచుకున్నాం అని అన్నారు.
రాబోయే రెండున్నర ఎండలో శివన్నగూడెం రిజర్వారికి నీటిని తెచ్చుకుంటాం, ఒక రైతుబిడ్డగా నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికి నీటిని తీసుకురావడమే నా లక్ష్యం,ఆ అపోహ పోగొట్టేలా రెవిన్యూ అధికారులు పనిచేయాలి.
కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం రైతుల కోసమే ప్రాజెక్టులు కడుతుంది కానీ బి ఆర్ ఎస్ లాగా కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టులు కట్టదు,ధరణిని తీసుకొచ్చి కేసీఆర్ కుటుంబం వారి అనుచరులు రాత్రికి రాత్రే అసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్చుకున్నారు.రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ సమూలమైన మార్పులు తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగపడే విధంగా పథకాలను అమలు చేసి ప్రజల అండగా ఉంటుంది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏడు లక్షల రెవిన్యూ అప్లికేషన్స్ ప్రభుత్వానికి అందాయి. వాటిలో ఆరు లక్షల వరకు సమస్యలను పరిష్కరించిందని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ, ఉమ్మడి నల్గొండ డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో శ్రీదేవి, రెవెన్యూ అధికారులు ఉన్నారు.