calender_icon.png 10 September, 2025 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన మహోన్నత వ్యక్తి ‘కాళోజీ’

09-09-2025 10:35:01 PM

ఉదయం కానేకాదనుకోవడం నిరాశ.. కాళోజీ నా గొడవ

ఎల్లారెడ్డి ఆర్డీవ కార్యాలయంలో

మహాకవి ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతి చిత్రపటానికి పూలమాల నివాళులర్పించిన, ఆర్డీవో పార్థసింహారెడ్డి 

పలు ప్రభుత్వ కార్యాలయాల్లో కాలోజి నారాయణరావు జయంతి వేడుకలు చిత్రపటానికి పూలమాలలు నివాళులు 

ఎల్లారెడ్డి (విజయక్రాంతి):

ఈ భాష ఈ వేషమెవరి కోసమురా

ఆంగ్లమందున మాటలనగానే

ఇంత కుల్కెదవెందుకు రా

తెలుగువాడివై తెలుగు రాదనుచు

సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా

అన్య భాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు

సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా!’

ఇతర భాషలపై మోజుతో మాతృభాషను విస్మరించేవారిని కాళోజీ కంటే గొప్పగా ఎవరు హెచ్చరిస్తారు. అందుకే ఆయన జయంతి ‘ తెలంగాణ భాషా దినోత్సవం ’ అయింది. తెలుగు భాష పట్ల ఆ ప్రజాకవికి ఉన్న మమకారం ఎనలేనిది. కాళన్న కాస్త పరుషంగానే హెచ్చరించినా.. అది తెలుగుదనం పట్ల ఆయనకున్న అనంతమైన అపేక్ష మాత్రమే గానీ మరొకటి కాదు. నేడు కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా తెలుగు భాషకు ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకుందాం.

1914 సెప్టెంబర్ 9న కర్ణాటకలోని బీజాపూర్ జిల్లా రట్టిహళ్లి గ్రామంలో కాళోజీ జన్మించారు. తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో రచయితగా గుర్తింపు పొందారు. రాజకీయ వ్యంగ్య కవిత్వం రాయడంలో కాళోజీ దిట్ట. బీజాపూర్ నుంచి వరంగల్ జిల్లాకు తరలివచ్చిన కాళోజీ కుటుంబం మడికొండలో స్థిరపడింది. ఎక్కడో మరాఠాల కుటుంబంలో పుట్టి, వరంగల్‌కు వచ్చి స్థిరపడి ‘నాది బడి పలుకుల భాష కాదు.. పలుకుబడుల భాష.. నా మాతృభాష తెలుగు’అని ఎలుగెత్తి చాటిన మహానుభావుడు కాళోజీ. తెలంగాణ పలుకుబడితో ప్రజల మాట, వ్యధలను ఆయన వ్యక్తం చేసిన తీరు అమోఘం.. అందరికీ ఆదర్శప్రాయం. అందుకే ఆయన జయంతిని ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించింది.

కాలేజీ అనగానే మొదట గుర్తొచ్చేది, నా.......

గొడవ’. ‘నా గొడవ’ అంటే ఆయన వ్యక్తిగతమైన సమస్య కాదు. సమకాలీన సమాజంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని, వాటిని అధిక్షేపిస్తూ అవన్నీ ‘నా గొడవ’ అన్నారు కాళోజీ. ‘అవనిపై జరిగేటి అవకతవకలకు ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు’ అంటూ.. ప్రపంచంలో జరుగుతున్న గందరగోళాలన్నిటికీ కాళోజీ కలం స్పందించింది.. కవితల తూటాలు చిందించింది. అడ్డమైన మురికినంతా తన్నేసే జీవనది.. ఆయన ‘గొడవ’.

అన్యాయాన్నెదిరిస్తే

నా గొడవకు సంతృప్తి

అన్యాయం అంతరిస్తే

నా గొడవకు ముక్తి ప్రాప్తి

అన్యాయాన్నెదిరించినోడు

నాకు ఆరాధ్యుడు’ - కాళోజీ.

‘ఉదయం కానేకాదనుకోవడం నిరాశ.. ఉదయించి అట్లాగే ఉండాలనుకోవడం దురాశ’ అంటూ మార్గనిర్దేశనం చేశారు ప్రజాకవి కాళోజీ. ఆయన కలం అంకుశం.. అవనిపై అవకతవకలకు ఆయన మనసు కకావికలమైంది.

వందేళ్ల కిందట పుట్టి వెయ్యేళ్లకు సరిపడా మెదళ్లను కదలించిన ఈ శతాబ్దపు మేటి కవి మన కాళోజీ. నిజాం ముష్కర పాలనకు, సమాజంలోని కుళ్లూ, కుతంత్రాలకు వ్యతిరేకంగా గళమెత్తారు కాళోజీ. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ అస్తమించినప్పుడు ‘పుటుక నీది చావు నీది.. బతుకంతా దేశానిది..’ అంటూ కాళోజీ నివాళి అర్పించారు. ఈ వాక్యాలు కాళోజీకి సరిగ్గా సరిపోతాయి. ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అంటూ ఆలోచనాజ్యోతులను వెలిగించిన కాళోజీ.. 2002 నవంబర్ 13న అస్తమించారు.

పరభాషా జ్ఞానాన్ని సంపాదించుకోవడం అవసరమే. కానీ, ఆ సాకుతో అమ్మ లాంటి మన భాషను నిర్లక్ష్యం చేయడం ఎంత తప్పు. నేటి తరం.. తెలుగు పదాలనే మర్చిపోతోంది. ఈ పరిస్థితి పోవాలి. మన తేటతెలుగు భాషకు పూర్వ వైభవం రావాలి. ప్రతి భాష ఒక దేవాలయం. ఎవరి యాస వారికే గొప్ప. మన భాషను, యాసను, చరిత్రను సగర్వంగా చెప్పుకునే తరుణం వచ్చింది.

ఏళ్లుగా అణిగిమణిగి ఉన్న తెలంగాణ యాస.. ఇప్పుడు అత్తరు పరిమళాలతో కొత్త సొబగులను అద్దుకుంది. ఈ సంస్కృతీ.. సంప్రదాయాలిప్పుడు లోకానికి కొత్త రుచిని చూపిస్తున్నాయి. ఇప్పటిదాక ఇంట్లొక మాట.. బయటొక మాటగా మన భాష తీరు ఉండేది. ఇప్పుడు ఈ పరిస్థితికి కాలం చెల్లింది.

మన యాసలో మనం రొమ్ము విరుచుకొని మాట్లాడే నూతనోత్సాహం వచ్చేసింది. తెలంగాణ ఉద్యమ కాలం నుంచే మొదలైన మార్పు ఇప్పుడు ఉద్యమ రూపంలో కొంత పుంతలు తొక్కుతోంది. ఇదే స్ఫూర్తితో దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి.. తెలంగాణ వేషభాషల తొలిసూరు బిడ్డ లాంటి కాళోజీ జయంతి సందర్భంగా.. ఆయనకు మనమిచ్చే గౌరవం ఇంతకంటే గొప్పగా వేరే ఏముంటుంది?