10-06-2025 10:47:16 PM
మెదక్ ఎంపీ రఘునందన్ రావు..
నాగర్కర్నూల్ (విజయక్రాంతి): బీజేపీది సూట్కేసులు మోసే ప్రభుత్వం కాదని, మాట మీద నిలబడే ప్రభుత్వం అని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు(BJP MP Raghunandan Rao) స్పష్టం చేశారు. మంగళవారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 11 ఏళ్ల సుపరిపాలనపై నిర్వహించిన జిల్లా స్థాయి కార్యశాలలో పాల్గొన్న ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడారు. త్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి ముస్లిం మైనార్టీల సంక్షేమానికి అనుకూలంగా వక్ఫ్ బోర్డు చట్టాన్ని పునర్వ్యవస్థీకరించామని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తూ, రాష్ట్రాన్ని వదిలిపెట్టి కొడంగల్ అభివృద్ధికే రూ.5,600 కోట్ల నిధులు కేటాయించడం అన్యాయం అన్నారు.
గత ముఖ్యమంత్రి సిరిసిల్ల, సిద్ధిపేట, గజ్వేల్ అభివృద్ధికి పరిమితమయ్యినట్లే, ప్రస్తుత సీఎం కూడా తన నియోజకవర్గంపైనే దృష్టి సారిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 18 నెలలైనా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో తట్టాడు మట్టి కూడా తీయలేదని మండిపడ్డారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో నాలుగో స్థానానికి తీసుకెళ్లిన ఘనత ప్రధాని మోదీకే దక్కిందని, పేదల అభివృద్ధికే పనిచేస్తున్నారని అన్నారు. టెర్రరిస్టుల క్యాంపులపై భారత సైన్యం దాడులు చేసి దేశ శక్తిని చాటిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు టిడిపి, టిఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలను చూశారని అయినా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీ భవిష్యత్తు అని ధీమా వ్యక్తం చేశారు. వారితోపాటు మాజీ ఎంపీ పోతుగంటి రాములు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దిలీప్ చారి, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి, ఎంపీ అభ్యర్థి భరత్ ప్రసాద్, జిల్లా అధ్యక్షులు వేమూరి నరేందర్, బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు.