03-05-2025 02:45:21 AM
హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమీ లేదని బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యం, నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారిందని బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆరోపించారు.రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, తెలంగాణ అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని ఆయన చెప్పారు.
జహీరాబాద్ నియోజకవర్గం న్యాలకల్ మండలం రత్నాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం హైదరాబాద్లో ఎమ్మెల్యే మాణిక్రావు ఆధ్వర్యంలో హరీశ్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, తాము ప్రారంభించిన బసవేశ్వర ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టిందని విమర్శించారు.
బసవేశ్వర ప్రాజెక్ట్ పూర్తి చేసే విషయంలో తాము పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. సాగు, తాగు నీరు కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తమ హయాం లో లేని నీటి సమస్య ఇప్పుడెందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు.