calender_icon.png 27 July, 2025 | 7:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గద్వాల ప్రజలతో నాకు విశేషమైన అనుబంధం

27-07-2025 01:22:48 PM

గద్వాల కాటన్ సీడ్ ఉత్పత్తిలో కీలకంగా నిలుస్తోంది

రాష్ట్ర ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇతరులపై నింద

కేంద్రం తెలంగాణకు అవసరమైన యూరియా పంపుతుంటే కొరత ఎందుకు

బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావు

గద్వాల,(విజయక్రాంతి): గద్వాల ప్రజలతో నాకు విశేషమైన అనుబంధం ఉందని గతంలోనే అనేకసార్లు గద్వాలను సందర్శించానని, ఇప్పుడు కూడా జిల్లాల వారీగా పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నామని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావు పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ముందుగా ఏబీవీపీ కార్యాలయాన్ని సందర్శించి అనంతరం డికె బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏబీవీపీలో విద్యార్థి నాయకునిగా ఉన్నపుడు గద్వాల్ ఇంచార్జి గా పనిచేసానని, ఇక్కడికి రాష్ట్ర అధ్యక్షుని హోదాలో రావడం నాకు ఒక మధుర అనుభూతిని కలిగించిందని, నాకు గద్వాల్ కి చాలా అవినాభావ సంబంధం ఉందన్నారు.

రాష్ట్ర అధ్యక్షులుగా అయిన తరువాత రాష్ట్రము లోని  అన్ని జిల్లాలను పర్యటిస్తున్నామని అందులో భాగంగానే నల్లగొండ, సూర్యపేట, మహబూబ్ నగర్, నారాయణపేట్, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్ తర్వాత ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల్లో నా పర్యటనలు జరుగుతున్నాయన్నారు.  గద్వాల కాటన్ సీడ్ ఉత్పత్తిలో కీలకంగా నిలుస్తోంది. కానీ ఇక్కడ రైతులకు సాగునీటి సదుపాయం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన మద్దతు అందడం లేదని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇతరులపై నిందలు మోపుతోందని యూపీఏ పాలనలో రైతులు ఎరువుల కోసం రోజుల తరబడి క్యూలైన్లలో నిల్చోవాల్సి వచ్చేది. అప్పట్లో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

క్యూలైన్లలో పోలీసులు లాఠీచార్జ్‌లు చేసేవారు. కానీ మోదీ ప్రభుత్వం వచ్చాక, నీమ్‌ కోటెడ్ యూరియాను అందుబాటులోకి తెచ్చిందన్నారు. తెలంగాణకు అవసరమైన 9.5 లక్షల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువగా, 12.02 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం సరఫరా చేసింది. ఇది అవసరానికి మించి 2.5 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు సరఫరా  అయినప్పటికీ రాష్ట్రంలో యూరియా కొరత ఉందంటూ కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన వివరించారు. రాష్ట్ర సి ఎం రేవంత్ రెడ్డి,  కేంద్రమంత్రి జేపీ నడ్డా ని కలిసినప్పుడు తెలంగాణకు అవసరమైన యూరియా ను కేంద్రం పూర్తిగా పంపిణీ చేస్తోందని చెప్పడం జరిగిందని, అయితే కేంద్రం తెలంగాణకు అవసరమైన మేరకు యూరియా పంపుతున్నప్పటికీ మార్కెట్‌లో యూరియా కొరత ఎందుకు ఏర్పడింది? దీనిపై దర్యాప్తు చేయాలని కూడా రేవంత్ రెడ్డిని కోరడం జరిగిందని ఆయన వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం దళారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ, ఎరువులను బ్లాక్ మార్కెట్‌కు తరలేలా ప్రోత్సహిస్తోందని . ఈ ప్రభుత్వం రైతులను తప్పుదారి పట్టిస్తూ కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని కానీ అసలు కారణం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అని ఆయన విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎరువుల కొరత తెలంగాణలోనే ఎందుకు వస్తోంది? ఈ అంశంపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్చకు సిద్ధమా? సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎరువుల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చేసింది. రైతుల జీవితాలతో చెలగాటమాడింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులను రైతులు నిలదీయాలి. ఎరువులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించాలని రైతులకు సూచించారు.