19-06-2025 12:08:58 AM
రాజన్న సిరిసిల్ల: జూన్,18(విజయక్రాంతి): జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు విడుతల్లో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా ప్రభుత్వం లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేసినది. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే నిరుపేదలకు ఇసుక భారం కాకూడదనే సదుద్దేశంతో ఫ్రీ ఇసుకకు పర్మిషన్ ఇచ్చి,ఇసుక క్వారీల నుండి ఉచిత ఇసుకను ప్రభుత్వం కేటాయించింది.
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఉచితం అని చెబుతున్న, ఇసుక రవాణా చేసే ట్రాక్టర్ల యజమానులు జిల్లాలోని పలు గ్రామాలకు ఇసుక రవాణా చేసినందుకు ఒక్కొక్క ట్రాక్టర్ ట్రిప్పునకు 3500 నుంచి 5000 వరకు అధికంగా రవాణా చార్జీలు వసూలు చేస్తున్నారు.
మీ ఇంటి నిర్మాణానికి ఇసుక అనుమతి తీసుకున్నారని, నిర్మాణానికి ఇసుక మా ట్రాక్టర్ ద్వారానే రవాణా చేస్తామని, ఒక్కొక్క ట్రాక్టర్ డీడీ తోనైతే 5000, లేకపోతే 4000 కు రవాణా చేస్తామని, మీ ఇష్టం ఉంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు అని అంటున్నారని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుపేదలకి సొంత ఇల్లు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతుంది.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదల ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందజేస్తుంది. ఇప్పటికే పలువురు లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను కూడా పంపిణీ చేసింది. ఇళ్లు మంజూరైన లబ్దిదారులు సొంత ఇంటి కల నెరవేరబోతున్నందుకు సంతోషంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టారు. ఇసుక ఉచితమైన ఇసుక రవాణా చార్జీలు భారంగా మారడం లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.
మేము నిరుపేదలమని ప్రభుత్వం మాకు ఇండ్లు మంజూరు చేస్తే, ఇసుక రవాణా పేరుతో అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని, ఇలాగైతే మా పరిస్థితి ఏమిటి అని ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి ఇసుక రవాణా చార్జీలు తగ్గించాలని, లేకపోతే ఆర్థికంగా నష్టపోతామని లబ్దిదారులు వేడుకుంటున్నారు.