స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి..
మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు..
బాన్సువాడ (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతిఒక్క బీఆర్ఎస్ కార్యకర్త సిద్ధంగా ఉండాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్(BRS Party Working President KTR), సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు(MLA Harish Rao) సూచించారు. బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు సోమవారం హైదరాబాద్లో వారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్, హరీష్రావులు మాట్లాడుతూ.. త్వరలోనే బాన్సువాడ నియోజకవర్గానికి ఇన్ఛార్జీని నియమిస్తామని స్పష్టం చేశారు.
అనంతరం బాన్సువాడలో తాజా రాజకీయ పరిస్థితుల గురించి ఆరా తీశారు. లోకల్బాడీ ఎలక్షన్లలో బాన్సువాడలో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకునేందుకు కృషి చేయాలని సూచించారు. ఏడాదిన్నర పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను గ్రామాల్లో ఎండగట్టాలని వారు సూచించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులకు, మహిళలకు చేసిన అభివృద్ధి పనులను వివరించాలని ఆయన స్పష్టం చేశారు. తాను ఎన్నికల ప్రచారంలో స్వయంగా పాల్గొంటానని హామీ ఇచ్చారు. మంత్రులను కలిసిన వారిలో బీఆర్ఎస్ మాజీ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబా ఎర్రవట్టి, బోడ రాంచందర్, శ్రీనివాస్, కుర్మ గంగారాం, లక్ష్మణ్, శంకర్, భూమన్న ఉన్నారు.






