14-07-2025 05:38:08 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, మరిపెడ పట్టణంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రవి రాథోడ్(District Medical Health Officer Dr. Ravi Rathod) తనిఖీ చేశారు. తొర్రూర్ పట్టణంలోని సుప్రీత, గణేశ్ డయాగ్నొస్టిక్ సెంటర్, నిర్మల, పద్మావతి ఆసుపత్రులను తనిఖీ చేసి రికార్డుల నిర్వహణ సరిగా లేవని అసహనం వ్యక్తం చేస్తూ అట్టి ఆసుపత్రులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. మరిపెడ బంగ్లాలోని మంద వెంకన్న నిర్వహిస్తున్న ప్రథమ చికిత్స కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయగా, అక్కడ రోగులకు అందిస్తున్న చికిత్స విదానాన్ని పరిశీలించగా ఎలాంటి అర్హతలు లేకుండా రోగులకు స్టెరాయిడ్ ఇంజక్షన్లు, యాంటీబాటిక్, సెలైన్ బాటిల్స్ ఎక్కిస్తూ చికిత్స చేస్తుండగా అసహనం వ్యక్తం చేస్తూ మంద వెంకన్న నిర్వహిస్తున్న ప్రథమ చికిత్స కేంద్రాన్ని సీజ్ చేశారు.
అంతే కాకుండా ప్రధమ చికిత్స కేంద్ర నిర్వాహకులు కేవలము ప్రథమ చికిత్సను మాత్రమే చేయాలని, యాంటీ బయాటిక్ ఇంజెక్షన్లు, మాత్రలు ఇవ్వరాదని, ఐ.వి ఫ్లూయిడ్స్ పెట్టరాదని, పేరు ముందు డాక్టర్ అని రాసుకోరాదని, అర్హత కి మించి వైద్యం చేయరాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, సిహెచ్ఓ విధ్యాసాగర్, డిప్యూటీ పారామేడికల్ ఆధికారి వనాకర్ రెడ్డి, హెల్త్ ఎడ్యుకేటర్ కె.వి.రాజు పాల్గొన్నారు.