బెల్లంపల్లిలో బీఆర్ఎస్ ఆందోళన..
బెల్లంపల్లి అర్బన్: రైతులకు సరిపడా ఎరువులను సరఫరా చేయడంలో వైఫల్యాన్ని నిరసిస్తూ.. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకి దిగారు. బుధవారం బెల్లంపల్లి కాంటా చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేశారు. సకాలంలో యూరియాను అందించడంలో ప్రభుత్వం విఫలమైందని గులాబీ శ్రేణులు మండిపడ్డారు. ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యూరియాను సరఫరా చేయకుండా రైతులను ఇక్కట్లకు గురి చేస్తున్నదని విమర్శించారు. కేసిఆర్ ప్రభుత్వం రైతులకు నాట్లు వేసిన వెంటనే యూరియా అందించారని గుర్తు చేశారు. రైతులకు యూరియానే అందించలేని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్టు ను రాజకీయం చేస్తూ కేసీఆర్ పై నిందలు వేస్తున్నదని మండిపడ్డారు. విచారణను సీబీఐకి అప్పగించడంపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, నాయకులు సుందర్ రావు, శ్రావణ్, అలీ తదితరులు పాల్గొన్నారు.






