calender_icon.png 18 February, 2026 | 5:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాక కుటుంబం అరాచకాలు ఎంతో కాలం సాగవు

18-02-2026 03:32:34 PM

మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో కాక వెంకట స్వామి కుటుంబం దౌర్జన్యం కాండ ప్రజలు చూస్తున్నారని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. బెల్లంపల్లిలో బీఆర్ఎస్ కౌన్సిలర్ల  ప్రమాణస్వీకారం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. క్యాతనపల్లిలో గుండాయిజం దౌర్జన్యంతో కాక కుటుంబం మంత్రి వివేక్ వెంకటస్వామి అక్కడ ఎన్నికను అడ్డుకుంటుందన్నారు. మంత్రి వివేకు వెంకటస్వామి అరాచకాలు మరోసారి బయటపడ్డాయన్నారు.

క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో 22 వార్డులకు గాను బీఆర్ఎస్ 14 స్థానాల్లో గెలిచిందన్నారు. బీఆర్ఎస్ అధికార కైవసానికి కాంగ్రెస్ అడ్డుపడుతుందన్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి పోలీసులను ఉసిగొలిపి అక్రమ కేసులు పెట్టించారని మండిపడ్డారు. ప్రజల తీర్పును ధిక్కరిస్తూ కాంగ్రెస్ గుండాయిజం, దౌర్జన్యంతో క్యాతనపల్లి ఎన్నిక వాయిదా పడ్డదని విమర్శించారు.  కాక కుటుంబం గుండాయిజాన్నీ ప్రజలు తిప్పికొడతారని అన్నారు.  ఈ అరాచకాలు ఎంతో కాలం సాగవని మండిపడ్డారు.

బెల్లంపల్లిలో నైతిక విజయం మాదే..

బెల్లంపల్లి మున్సిపాలిటీలో నైతిక విజయం బీఆర్ఎస్ దే అని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 14 స్థానాల్లో గెలుపొందామన్నారు. కాంగ్రెస్తో పోటాపోటీగా విజయంలో గట్టి పోటీ ఇచ్చామన్నారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ అధికార బలంతో బెల్లంపల్లిలో గుండాయిజం దౌర్జన్యాలకు దిగారన్నారు. తమకు మద్దతునిచ్చిన స్వతంత్ర సభ్యులను బెదిరింపులకు గురిచేసారన్నారు. తమకు మద్దతిచ్చిన స్వతంత్ర సభ్యుల ఇళ్లలకి వెళ్లి కాంగ్రెస్ గూండాలు ,పోలీసులు బెదిరించారని తెలిపారు. బెదిరింపులు, మద్యం, డబ్బులను ఎర్రగా చూపి స్వతంత్ర సభ్యులను ప్రలోభాలకు గురిచేసి ఎత్తుకెళ్లారని ఆరోపించారు.

అప్రజాస్వామికంగా  బెల్లంపల్లి పురపాలన పగ్గాలను  చేజిక్కించుకున్నారని మండిపడ్డారు. కాక కుటుంబం అరాచకాలు బెల్లంపల్లిలో శృతిమించిపోయాయన్నారు. అధికార అహంకారంతో విర్రవీగుతున్నారనీ ధ్వజమెత్తారు.  ఈ రాచకాలను ప్రజలు  తిప్పికొడతారన్నారు. బీఆర్ఎస్ ను ప్రజలు ఎంతగానో ఆదరించారన్నారు. బెల్లంపల్లి అభివృద్ధిలో కీలకపాత్ర వహిస్తామన్నారు.  ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తామన్నారు. ప్రతిపక్షంగా ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు నిలుస్తారన్నారు. ప్రజల రుణం అభివృద్ధి రూపేణా తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో మాజీ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ, బీఆర్ఎస్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.