09-08-2025 12:51:40 AM
జనగామ, ఆగస్టు 8 (విజయ క్రాంతి): జఫర్గడ్ మండలం తమ్మడపల్లి(ఐ) గ్రామం లో తల్లి, కూతుర్లు దారుణ హత్యకు గురైన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం గాలి రాణమ్మ (50), తుమ్మ అన్నమ్మ (90) తల్లి కూతుర్లు వ్యవసాయ పనులు చేసుకుంటూ గ్రామానికి దూరంగా ఉన్న ఇంటిలో నివాసం ఉంటున్నారు. మృతురాలు భర్త జార్జి రెడ్డి కొన్ని సంవత్సరాల క్రితం మరణించాడు.
ఆమెకి కూతురు కవిత ఉంది. పెళ్ళి అయ్యి కుటుంబంతో విజయవాడ దగ్గర ఉంటోంది. రోజు లాగే శుక్రవారం ఉదయం 7 గంటలకు వీరి ఇంట్లో పని చేసే పనిమనిషి కూతురు ఇల్లందుల జెన్నిక తలుపులు తెరవగానే అన్నమ్మ మంచంపై రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంది. అన్నమ్మ కూతురు రాణి కోసం వెతకగా ఇంటి ముందు వేప చెట్టు కింద పరుద కప్పి ఉండడంతో పరుదతీసి చూసేసరికి తలపై బలమైన గాయాలతో రక్తపు మరకలతో చనిపోయి ఉన్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి డాగ్ స్క్వాడ్ , క్లోస్ టీంల సాయంతో ఆధారాలు సేకరించారు. మృతురాలు రాణి కూతురు కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దేవరుప్పుల మండలం నీరుమాల గ్రామంలో అన్నమ్మ కుటుంబానికి ఇచ్చిన రెండు ఎకరాల వ్యవసాయ భూమి తగదా వీరి హత్యకు కారణమై ఉంటుందని స్థానికులు చర్చించుకుంటున్నారు.
ఘటనాస్థలిని సందర్శించిన ఏసీపీ
జఫర్గడ్ మండలం తమ్మడపల్లి(ఐ)లో జరిగిన తల్లి కూతుర్ల హత్య జరిగిన స్థలాన్ని వర్ధన్నపేట ఏసిపి అంబటి నరసయ్య, ఇన్స్పెక్టర్ శ్రీనివాస రావు, జఫర్గడ్ ఎస్త్స్ర రామ్ చరణ్ సందర్శించి దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు.