30-12-2025 12:00:00 AM
డబ్బు, బంగారాన్ని దోచుకున్న కిరాయిదారుడు
శవాన్ని ఏపీలోకి కోనసీమ జిల్లా పరిధిలోని గోదావరిలో పడవేత
మల్లాపూర్లోని బాబానగర్లో ఘటన
ఉప్పల్, డిసెంబర్ 29(విజయక్రాంతి): ఇంటి యజమానినే హత్య చేసి డబ్బు, బంగా రం అపహరించిన సంఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మల్లాపూర్ బాబా నగర్లో ఉంటున్న సూరెడ్డి సుజాత రెడ్డి (65) ఈనెల 18న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు నాచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇంట్లో ఉన్న కిరాయిదారుడిపై పోలీసులకు అనుమానం వచ్చింది. సుజాత రెడ్డిని హత్య చేసింది ఇంట్లో అద్దెకుంటున్న అతనే అని నిర్ధారించుకున్న పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి కేసును చేధించారు. నాచారం సీఐ ధనుంజయ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం. ఆంధ్రప్రదేశ్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన మండు అంజిబాబు (33) రెండు నెలల క్రితం సుజాత రెడ్డి ఇంట్లో అద్దెకు దిగాడు. డ్రైవర్గా ఉంటూ జీవనం సాగిస్తున్నాడు.
సుజాత రెడ్డి ఒంటరిగా ఉండడం గమనించిన అంజిబాబు ఆమె వద్ద ఉన్న ఇంటి పత్రాలు, బంగారు నగలు, డబ్బుపై కన్నేశాడు. ఆమెను హతమార్చి ఆస్తిని సొంతం చేసుకోవాలని పక్కా ప్లాన్ చేసుకున్నాడు. ఈనెల 18న సుజాత రెడ్డి ఇంట్లోకి చొరబడి గొంతు నులిమి హత్య చేసి ఈ విషయాన్ని తన స్నేహితులైన నాకంటి యువరాజ్, నూకల దుర్గారావుకు చెప్పాడు. వారి సహాయంతో మృతుదేహాన్ని కోనసీమ జిల్లా పరిధిలోని గోదావరి నదిలో పడివేశారు. పక్కా సమాచారంతో అంజిబాబును, అతని స్నేహితులను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు.