26-10-2025 10:46:33 PM
- లాడ్జిలో విక్రయిస్తూ 8 మంది యువకులు అరెస్ట్..
- 735 గ్రాముల ఎండు గంజాయి, ఏడు సెల్ ఫోన్లు స్వాదీనం..
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లాలో గంజాయి బహిరంగ విక్రయాలు తీవ్ర కలకలం సృష్టించింది. పట్టణ నడిబొడ్డున ఉన్న ఓ లాడ్జిలో ఎండు గంజాయి విక్రయిస్తున్నారన్న ఖచ్చితమైన సమాచారంతో పోలీసులు దాడులు జరిపారు. ఈ దాడిలో నలుగురు విక్రయదారులతో పాటు మరో నలుగురు వినియోగదారులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 735 గ్రాముల ఎండు గంజాయితో పాటు ఏడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీటికి సంబంధించిన వివరాలను ఆదివారం డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు మీడియాకు వివరాలు వెల్లడించారు. దూల్పేట ప్రాంతానికి చెందిన ఆకాష్ సింగ్ అనే వ్యక్తి నుండి నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఈదమ్మ గుడి కాలనీకి చెందిన బొందల రేణు కుమార్, ఈశ్వర్ కాలనీకి చెందిన మైలగాని సందీప్, రాఘవేంద్ర కాలనీకి చెందిన అరకు విశ్వాస్ అనే పాతికెళ్ళ వయసుగల యువకులు సుమారు కిలో బరువు గల ఎండు గంజాయిని కొనుగోలు చేశారు.
అట్టి గంజాయిని జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన కొత్త వెంకటేష్, హరిజనవాడ కాలనీకి చెందిన కొత్త మనోజ్ కుమార్, తాడూరు మండలం గుంతకోడూరు గ్రామానికి చెందిన ఉడతల ఆది కృష్ణ గౌడ్, అదే గ్రామానికి చెందిన గుల్ల పరమేష్ అనే నలుగురు పాతికేళ్ల వయసు లోపు యువకులు కొనుగోలు చేశారు. ఈ క్రమంలో ఖచ్చితమైన సమాచారం అందడంతో జిల్లా కేంద్రంలోని చైతన్య లాడ్జిలో దాడులు జరిపి పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి నిందితులను కోర్టు ముందు హాజరు పరిచిన అనంతరం సమగ్ర దర్యాప్తు కోసం కోర్టు అనుమతి తీసుకుని మరింత లోతుగా దర్యాప్తు జరపనున్నట్లు డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు తెలిపారు.