పరేడ్ గ్రౌండ్లోనే వేడుకలు
తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలకు వేదిక
ఏర్పాట్లు, భద్రత అంశాలపై సీఎస్ శాంతికుమారి సమీక్ష
హైదరాబాద్, మే 24 (విజయక్రాంతి) : వచ్చే నెల 2న నిర్వహించనున్న రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహిం చారు. వేడుకలకు ఎన్నికల సంఘం అనుమతి లభించిందని, ఎప్పటిలాగే సికింద్రా బాద్లోని పరేడ్ గ్రౌండ్ వేదికగానే ఉత్సవాలు జరుగుతాయని సీఎస్ స్పష్టం చేశా రు. ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మొదట గన్పార్క్ వద్దకు వెళ్లి అమరవీరులకు నివాళులర్పిస్తారని తెలిపారు.
అనం తరం పరేడ్ గ్రౌండ్లో జరిగే వేడుకలకు హాజరవుతారని వెల్లడించారు. ఈ మేరకు పరేడ్ గ్రౌండ్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. సభాప్రాంగణ పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్యలోపాలను సరిదిద్దాలని ఆదేశించారు. తాగునీటి వసతిలో అసౌకర్యం కలగ కూడదని చెప్పారు. రోడ్డుకు ఇరువైపులా జెండాలను అలంకరించాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. పండుగ వాతావరణాన్ని తలపించేలా వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
వేడుకల వేళ విద్యుత్ సరఫరాకు ఎట్టి పరిస్థితుల్లో అంతరాయం కలగకుండా విద్యుత్ శాఖ బాధ్యతగా వ్యవహరించాలని హితబోధ చేశారు. వేడుకల విజయవం తానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనులు చేయాలని చెప్పారు. సమీక్షలో డీజీపీ రవిగుప్తా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా , ముఖ్యకార్యదర్శులు బి.వెంకటేశం, జితేందర్, కార్యదర్శులు క్రిస్టినా జోంగ్తూ, హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు ఎండి సుదర్శన్ రెడ్డి, టీజీ ఎస్పీడీసీఎల్ ఎండీ మషారష్ ఫరూఖీ, సీడీఎంఏ దివ్య, సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంతరావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






