31-12-2025 11:00:19 AM
గోపేశ్వర్: చమోలీ జిల్లాలోని(Chamoli train accident) విష్ణుగడ్-పిపల్కోటి జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలోని పిపల్కోటి టన్నెల్లో ఒక లోకో రైలు గూడ్స్ రైలును ఢీకొన్న ఘటనలో సుమారు 60 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులకు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఘటనాస్థలిలో అధికారులు సహాయచర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై చమోలి జిల్లా మేజిస్ట్రేట్ గౌరవ్ కుమార్ మాట్లాడుతూ... సాయంత్రం ఆలస్యంగా జరిగిన ఈ ప్రమాద సమయంలో కార్మికులను తీసుకెళ్తున్న రైలులో మొత్తం 109 మంది ఉన్నారని, వారిలో సుమారు 60 మందికి గాయాలయ్యాయని తెలిపారు. ఈ ఘటనలో చిక్కుకున్న వారందరినీ రక్షించామని, గాయపడిన వారందరి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.
టీహెచ్డీసీ (ఇండియా) నిర్మిస్తున్న విష్ణుగడ్-పిపల్కోటి ప్రాజెక్టులోని పిపల్కోటి సొరంగం లోపల ఒకే ట్రాక్పై కార్మికులు, అధికారులను తీసుకువెళ్తున్న ఒక లోకోమోటివ్ రైలు, నిర్మాణ సామగ్రిని తీసుకువెళ్తున్న మరో రైలు ప్రయాణిస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగిందని జిల్లా మేజిస్ట్రేట్ వివరించారు. పొడవైన సొరంగాల లోపల కార్మికులను, ఇంజనీర్లను, అధికారులను, నిర్మాణ సామగ్రిని రవాణా చేయడానికి ఇటువంటి లోకోమోటివ్ రైళ్లను నిత్యం ఉపయోగిస్తారని తెలిపారు. చమోలీ సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ మాట్లాడుతూ... గాయపడిన పది మందిని చికిత్స నిమిత్తం గోపేశ్వర్లోని జిల్లా ఆసుపత్రికి తరలించామని, మరో 17 మందికి పిపల్కోటిలోని వివేకానంద ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని తెలిపారు.
మిగిలిన గాయపడిన వారి పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఢీకొన్న ప్రభావం సొరంగం లోపల భయాందోళనలు, కేకలు రేకెత్తించాయి, కార్మికులు పరిమిత స్థలంలో తమ మార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నించడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన గురించి తెలియగానే, ప్రాజెక్ట్ యాజమాన్యం, స్థానిక పరిపాలన విభాగానికి చెందిన బృందాలు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని, తక్షణమే రెస్క్యూ కార్యకలాపాలను ప్రారంభించాయి. విష్ణుగడ్-పిపల్కోటి జలవిద్యుత్ ప్రాజెక్ట్ అనేది చమోలీ జిల్లాలోని హేలాంగ్ -పిపల్కోటి మధ్య అలకనంద నదిపై నిర్మిస్తున్న 444 మెగావాట్ల ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు నాలుగు టర్బైన్ల ద్వారా 111 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయడానికి రూపొందించబడింది. వచ్చే ఏడాది నాటికి దీనిని పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.