13-08-2024 04:18:42 PM
గత నెలక్రితమే పాతాళగంగ వద్ద చిరుత దర్శనం
మళ్ళీ నేడు ఆలయ అధికారి ఇంట్లోకే చొరబాటు
అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా భయాందోళనలో భక్తులు
నాగర్ కర్నూల్: శ్రీశైలంలో చిరుత సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. గత నెలక్రితం శ్రీశైల క్షేత్రంలో పాతాళ గంగ వద్ద అర్ధరాత్రి సమయంలో చిరుత పులి సంచరించినట్లు సిసిటీవీలో రికార్డయ్యాయి. ఆ విషయంలో స్థానికులు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా కేవలం తాత్కాలిక ఉపశమనం కోసం సలహాలు సూచనలు ఇస్తూ జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించి వెళ్లారు.
అది మరువక ముందే మంగళవారం శ్రీశైలం దేవస్థానం ఏఈఓ మోహన్ ఇంటి పరిసరాల్లోని తన పెంపుడు కుక్క కోసం కాంపౌండ్ వాల్ లోకి చొరబడింది. దీంతో భారీ శబ్దంతో స్థానికులు అరవడంతో అడవిలోకి పారిపోయింది. శ్రీశైలానికి వచ్చి పోయే భక్తులంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అధికారి ఇంట్లోకి చొరబడినా అటవీశాఖ అధికారులు చిరుతపులిని పట్టుకోవడంలో నిర్లక్ష్యం వహించడంపై స్థానికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
చిరుత సంచరిస్తున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలలో రికార్డు కావడంతో ఆలయ ఈఓ పెద్దిరాజు అప్రమత్తమై భక్తులకు స్థానికులకు సలహాలు సూచనలు హెచ్చరికలు జారిచేశారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో చిరుత సంచరించే ప్రదేశాలు పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చిరుత పులేనని నిర్ధారణకు వచ్చిన అధికారులు త్వరలోనే పట్టుకుంటామని భరోసా ఇచ్చారు.