26-10-2025 10:04:55 AM
వేములవాడ టౌన్,(విజయక్రాంతి): అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది. చందుర్తి మండలం ఆశిరెడ్డి పల్లి గ్రామంలో శనివారం రాత్రి పాము కాటుకు గురైన 18 నెలల చిన్నారి వేదాన్షి మృతి చెందారు. వివరాల్లోకి వెళితే... చేకూట సుమలత, రమేష్ దంపతుల కూతురు అయిన వేదాన్షి 18 నెలలు శనివారం రాత్రి ఇంటి ముందు ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు పాము కాటు వేసింది. చిన్నారిని పాము కరిచినట్లు గమనించిన తల్లిదండ్రులు వెంటనే అప్రమత్తమయ్యారు. చిన్నారిని హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, పాము విషం శరీరంలో వేగంగా వ్యాపించడం, పరిస్థితి విషమించడంతో వేదాన్షి మృతి చెందారు. చిన్నారి మరణంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. చిన్నారి మృతి పట్ల బంధువులు, గ్రామస్థులు సంతాపం వ్యక్తం చేశారు.