calender_icon.png 9 December, 2025 | 8:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ బలపరిచే అభ్యర్థులనే ఎన్నుకోండి..

09-12-2025 07:35:22 PM

పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు..

పెద్దపల్లి నియోజకవర్గంలో ఆరుగురు సర్పంచులు ఏకగ్రీవం..

బోనీ కొట్టిన కాంగ్రెస్ సర్పంచులను సత్కరించిన ఎమ్మెల్యే..

సుల్తానాబాద్ (విజయక్రాంతి): ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు గడపగడపకు చేరేందుకు గాను పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచే అభ్యర్థులనే గెలిపించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. మంగళవారం రాత్రి సుల్తానాబాద్ పట్టణంలోని యశోద నరహరి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పెద్దపల్లి నియోజకవర్గంలోని ఆరు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సర్పంచులుగా ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారని తెలిపారు. సుల్తానాబాద్ మండలంలోని నారాయణరావుపల్లి సర్పంచ్ గా నామని రాజిరెడ్డి, గొల్లపల్లి సర్పంచ్ గా కొత్తూరి స్వరూప, రాముని పల్లి సర్పంచ్ గా సబ్బని అనసూయ, పెద్దపల్లి మండలం రాంపల్లి సర్పంచ్ గా కానపర్తి సంపత్ రావు, ఓదెల మండలం పిట్టల ఎల్లయ్య పల్లి సర్పంచ్ గా పిట్టల రవీందర్, ఎలిగేడు మండలం  రేకల్దేవ్పల్లి సర్పంచ్ గా మద్దెల రమాదేవి లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

వీరిని ఎమ్మెల్యే విజయ రమణారావు కాంగ్రెస్ పార్టీ కండువాలు, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా విజయ రమణారావు మాట్లాడుతూ ఇప్పటికే నియోజకవర్గంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉండే సర్పంచులను కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని ఎన్నుకుంటే మరింత అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు చేరువ అవుతుందని చెప్పారు. ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన ప్రజలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు వివిధ పక్షాలకు అయినా కృతజ్ఞతలు తెలిపారు.

రానున్న రోజుల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే సాంప్రదాయాన్ని కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. శాంతియుత, సమైక్య నినాదానికి సర్పంచ్ల ఏకగ్రీవ ఎన్నికలు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగరి శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిరి మహేందర్, వేగోళం అబ్బయ్య గౌడ్, పడాల అజయ్, కాంగ్రెస్ పార్టీ లీడర్లు పాల్గొన్నారు.