calender_icon.png 7 June, 2025 | 9:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగింపు దశకు ధాన్యం కొనుగోలు

06-06-2025 10:43:21 PM

నిర్మల్,(విజయక్రాంతి): వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్  అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో పౌరసరఫరాల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా అంతటా వరి కొనుగోలు చివరి దశకు చేరుకున్నదని, మిగిలిన ధాన్యాన్ని నాలుగు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అకాల వర్షాల వల్ల కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదురైనప్పటికీ, అధికారుల సమిష్టి కృషితో సజావుగా కొనుగోలు కొనసాగిందని చెప్పారు. తడిసిన ధాన్యాన్ని కూడా రైతుల నుంచి మద్దతు ధరకు సేకరిస్తున్నామని, ఒక్క గింజ మిగలకుండా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.

ఇప్పటివరకు 1,76,843 మె.టన్నుల వరి సేకరించామని, గత ఏడాదితో పోలిస్తే 6,090 మె.టన్నులు అధికమని చెప్పారు. 38,841 మంది రైతులు పడి విక్రయించగా, మొత్తం ప్రక్రియను డీసీఎస్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్ రూమ్ నెంబర్ 9182958858 ను సంప్రదించాలని సూచించారు. రైతులకు అసౌకర్యం కలగకుండా, అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, డీసీఎస్ఓ కిరణ్ కుమార్, మేనేజర్ సుధాకర్,అధికారులు, తదితరులు పాల్గొన్నారు.