26-08-2025 12:42:16 PM
హైదరాబాద్: కెనడాలో జరుగుతున్న ప్రపంచ యూత్ ఆర్చరీ ఛాంపియన్షిప్(World Archery Championship)లో స్వర్ణ పతకం సాధించి వరల్డ్ చాంపియన్గా నిలిచిన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన చికిత తానిపర్తికి మంగళవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అభినందనలు తెలియజేశారు. ఆర్చరీ అండర్-21 కేటగిరీ ఫైనల్ లో కొరియాకు చెందిన పార్క్ యెరిన్పై విజయం సాధించి స్వర్ణం చేజిక్కించుకుని చికిత వరల్డ్ చాంపియన్గా నిలవడం దేశానికే గర్వకారణమని అన్నారు. ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత, లక్ష్యాన్ని సాధించాలన్న చికిత సంకల్పం యువతీ యువకులకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆటుపోట్లను తట్టుకుంటూ గ్రామీణ ప్రాంతం నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆర్చరీలో రాణించిన చికిత భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని సీఎం ఆకాంక్షించారు. చిన్ననాటి నుంచి చికితలోని ప్రతిభను గుర్తించి అందుకు అనుగుణంగా ప్రోత్సహించిన తల్లిదండ్రులకు సీఎం రేవంత్ అభినందనలు తెలియజేశారు.