26-08-2025 02:05:23 PM
హైదరాబాద్: భాగ్యనగరంలో పలుచోట్ల వర్షం(Hyderabad Rain) మొదలయింది. మంగళవారం తెల్లవారుజామునుంచే ఆకాశం మేఘావృతమై ఉండగా.. తాజాగా చందానగర్, మియాపూర్, కొండాపూర్, హఫీజ్ పేట్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గంలో వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసూఫ్ గూడ, అమీర్ పేట్, గచ్చిబౌలి, మణికొండ, షేక్ పేట్, టోలీచౌకి, మెహదీపట్నం, ఎర్రగడ్డ, కూకట్ పల్లి, మాసబ్ ట్యాంక్, శేరిలింగంపల్లి, పటాన్చెరు తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది.
అటు, తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల్లో ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ(Hyderabad Meteorological Department) హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో వాతావరణ మార్పుల ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. వాతావరణ శాఖ విడుదల చేసిన సూచనల ప్రకారం... వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల అల్పపీడనం రాబోయే 24 గంటల్లో అల్పపీడన ప్రాంతంగా బలపడే అవకాశం ఉంది. అదనంగా, రుతుపవన ద్రోణి కూడా చురుగ్గా కొనసాగుతోంది. రెండింటి ప్రభావంతో మంగళ, బుధవారాల్లో భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.