19-11-2025 05:10:02 PM
హైదరాబాద్: కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమంలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా అందరూ సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి కార్యక్రమం కింద ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ పథకంపై ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీర పథకాన్ని ముఖ్యమంత్రి గారు లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క, ఇతర మంత్రివర్గ సహచరులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, మహిళా సమాఖ్యల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
రాష్ట్రంలో ఏ ఒక్క మహిళా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులకు సారె, చీర ఇవ్వడం సంప్రదాయమని సీఎం పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం ఆడబిడ్డలందరికీ సారె అందించాలని ఇందిరమ్మ చీరలను పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు. అన్ని జిల్లాల్లో మండల కేంద్రాల్లో స్థానిక శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ నిర్దేశించిన గడువులోగా విడతల వారిగా పంపిణీ పూర్తి చేయాలని, ప్రజా ప్రతినిధులకు ప్రత్యేకంగా సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక అధికారిని నియమించి ఈ కార్యక్రమ బాధ్యతలను అప్పగించాలని ఆయన తెలిపారు. మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి కార్యక్రమం కింద చేపడుతున్న చీరల పంపిణీ పథకం గురించి ముందుగానే ప్రజలందరికీ తెలిసేలా చెప్పాలని అధికారులను ఆశించారు.
మహిళా సంఘాలు ఉత్పత్తులను శిల్పారామంలో కేటాయించిన ఇందిరా శక్తి బజార్లో మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పించామని, అలాగే మహిళా సంఘాల ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు తేవాలని అమెజాన్ ద్వారా ఆన్లైన్లో ఉత్పత్తులను విక్రయించుకునే అంశంపై ఆ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన వెల్లడించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.27 వేల కోట్లు వడ్డీ లేని రుణాలు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమే కాకుండా వాటికి యజమానులను చేయడం, అమ్మ ఆదర్శ పాఠశాల నిర్వహణను అప్పగించడం, మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు అప్పగించడం వంటి చర్యల అనేక కార్యక్రమాల ద్వారా వారిని ఆర్థికంగా ముందుకు తీసుకెళుతున్నాం.
మహిళా సంఘాలకు ఇప్పటి వరకు డ్రెస్ కోడ్ లేని కారణంగా సరైన గుర్తింపు లభించలేదని, గత ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు అందించడంలో నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. వాటిని సరిదిద్దుకుంటూ ప్రభుత్వం ముందుకు పోతోందని సీఎం వ్యాఖ్యానించారు. చీరల పంపిణీని ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాలన్నది ప్రభుత్వ విధానం అని, 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో నిర్ణయాలు తీసుకుంటున్నామని, ఆడబిడ్డ ఆర్థికంగా బలపడితే కుటుంబాల్లోని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆయన వివరించారు. చీరల పంపిణీ విషయంలో ఎలాంటి లోటు పాట్లు చూడాలి. కుల గణన సందర్భంగా సేకరించిన వివరాల డేటా కలెక్టర్ల వద్ద ఉంది. ఫేషియల్ రికగ్నిషన్తో పాటు ఆధార్ నంబర్ నమోదు చేసుకుని ఎక్కడా తప్పులు జరక్కుండా పారదర్శకంగా పంపిణీ కార్యక్రమం జరగాలి.
చీరల విషయంలో ఎవరూ ఆందోళన పడాల్సిన పనిలేదని, మున్సిపాలిటీలు, పట్టణాల్లో రెండో విడతలో చీరలు అందిస్తామని, ఏ మహిళకూ చీర అందలేదన్న సమస్య ఉత్పన్నం కావొద్దని విజ్ఞప్తి చేశారు. తూతూ మంత్రంగా కార్యక్రమం నిర్వహించడానికి వీలులేదని, భవిష్యత్తులో ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలన్నా ఈ కార్యక్రమాన్ని ప్రామాణికంగా తీసుకునేలా, అందరూ సమన్వయంతో పనిచేయాలని మార్గనిర్దేశం చేశారు. వివిధ జిల్లాల నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న మహిళా సమాఖ్య ప్రతినిధులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. చీరల తయారీ సందర్భంగా సమాఖ్య ప్రతినిధులు సిరిసిల్లాకు వచ్చి పరిశీలించి బాగున్నాయని చెప్పారని సిరిసిల్లా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య తెలిపారు.
చీరల రంగు, డిజైన్ బాగున్నాయని ఆసిఫాబాద్ జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు శ్రీదేవి చెప్పారు. మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకులు ఎలా నడుస్తున్నాయని ఈ సందర్భంగా నారాయణపేట జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు అరుంధతిని రేవంత్ రెడ్డి వాకబు చేశారు. సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వాకిటి శ్రీహరి,సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ సీఎస్ కె. రామకృష్ణ రావుతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.